ఒకప్పుడు రాష్ట్రంలో ఏ ఎన్నికలు జరిగిన పోరు టిఆర్ఎస్-కాంగ్రెస్ పార్టీల మద్యనే సాగేది. ఆ తరువాత ఫిరాయింపులతో కాంగ్రెస్ బలహీనపడినా కూడా అదే టిఆర్ఎస్తో తలపడుతుండేది. కానీ బండి సంజయ్ రాష్ట్ర బిజెపి అధ్యక్షుడిగా పగ్గాలు చేపట్టినప్పటి నుంచి బిజెపియే టిఆర్ఎస్ను బలంగా డ్ఢీకొంటోంది. అందుకు దుబ్బాక ఉపఎన్నికలు, దాని ఫలితాలే తాజా ఉదాహరణ. ఇప్పుడు జీహెచ్ఎంసీ ఎన్నికలలో కూడా మళ్ళీ అదే జరుగుతోంది.
ఇదివరకు బిజెపి గురించి ఏనాడూ పెద్దగా ఆలోచించని టిఆర్ఎస్ ఇప్పుడు కాంగ్రెస్ గురించి ఆలోచించడం మానేసి బిజెపి గురించే ఎక్కువగా ఆలోచిస్తోంది... ఎక్కువగా మాట్లాడుతోంది కూడా. అంటే బిజెపి ప్రత్యామ్నాయ శక్తిగా ఎదుగుతోందని టిఆర్ఎస్ కూడా గుర్తించిన్నట్లు అర్ధమవుతోంది.
ఇప్పుడు పోరు టిఆర్ఎస్-బిజెపిల మద్యకు మారడంతో కాంగ్రెస్ రాజకీయంగా నష్టపోవడమే కాకుండా తన ఉనికిని కూడా కోల్పోతోంది. దుబ్బాక ఉపఎన్నికలలో ఈ పరిస్థితి కళ్ళకు కట్టినట్లు కనబడింది. మళ్ళీ ఇప్పుడు జీహెచ్ఎంసీ ఎన్నికలలో కూడా అదే జరుగుతోంది. ఇప్పటివరకు 2వ స్థానంలో ఉన్న కాంగ్రెస్ దుబ్బాక ఉపఎన్నికలతో 3వ స్థానానికి దిగజారింది. హటాత్తుగా ఇలా ఎందుకు జరుగుతోందో కాంగ్రెస్ పెద్దలే ఆలోచించుకోవలసి ఉంది. ఒకవేళ ఇక ముందు కూడా పరిస్థితులు ఇలాగే కొనసాగితే వచ్చే శాసనసభ ఎన్నికల నాటికి రాష్ట్రంలో కాంగ్రెస్ పోటీ చేయలేని పరిస్థితి ఏర్పడినా ఆశ్చర్యం లేదు.