సిఎం కేసీఆర్ అధ్యక్షతన నిన్న ప్రగతి భవన్లో జరిగిన ఉన్నతస్థాయి సమావేశంలో హైదరాబాద్లో కరోనా పరిస్థితిపై సమీక్షించారు. నగరంలో కరోనా కేసులు బయటపడుతున్నప్పటికీ పరిస్థితులు అదుపులోనే ఉన్నాయని సిఎం కేసీఆర్ అభిప్రాయం వ్యక్తం చేశారు. కనుక నేటి నుంచి హైదరాబాద్లో షాపింగ్ మాల్స్ తప్ప మిగిలిన అన్ని రకాల దుకాణాలు సరిబేసి విధానం లేకుండానే ప్రతీరోజు తెరుచుకొనేందుకు అనుమతించారు. అయితే దుకాణాల వద్ద కరోనా జాగ్రత్తలు, భౌతికదూరం పాటించడం తప్పనిసరి. ఎవరైనా నిబందనలను పాటించకపోతే జీహెచ్ఎంసీ అధికారులు ఆయా దుకాణాలను మూసివేయిస్తారు.
కరోనా నేపధ్యంలో కరోనా జాగ్రత్తలు, భౌతికదూరం పాటిస్తూ జూన్ 2వ తేదీన రాష్ట్రావతరణ దినోత్సవాన్ని నిరాడంబరంగా జరుపుకోవాలని సిఎం కేసీఆర్ అధికారులకు సూచించారు. ఆరోజు ఉదయం సిఎం కేసీఆర్ ముందుగా అమరవీరుల స్తూపం వద్ద నివాళులు అర్పించి తరువాత ప్రగతి భవన్లో పతాకావిష్కరణ చేస్తారు.