ప్రపంచ ఆరోగ్య సంస్థ కార్యనిర్వాహక మండలి అధ్యక్షుడిగా కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి డాక్టర్ హర్షవర్ధన్ నియమితులయ్యారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా శుక్రవారం ఆయన ఈ బాధ్యతలు స్వీకరించనున్నారు. ఈ పదవిలో ఆయన మూడేళ్ళు అంటే మే, 2023 వరకు కొనసాగుతారు.
కరోనా నేపద్యంలో అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ప్రపంచ ఆరోగ్య సంస్థపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్న ఈ సమయంలో ఆ సంస్థ కార్యనిర్వాహక మండలి అధ్యక్ష పదవి భారత్కు లభించడం యాదృచ్చికమనుకోలేము. చైనాపై తీవ్ర ఆగ్రహంతో రగిలిపోతున్న అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఒత్తిడి మేరకే భారత్కు ఈ లభించి ఉండవచ్చు. చైనాపై ద్వేషంతో లేదా అమెరికా అధ్యక్ష ఎన్నికలను దృష్టిలో పెట్టుకొనో డోనాల్డ్ ట్రంప్ భారత్కు దగ్గర అవ్వాలనుకొంటున్నట్లు స్పష్టంగా కనిపిస్తోంది. ఆ ప్రయత్నంలో భాగంగానే భారత్ అడగక పోయినా వెంటిలేటర్లు పంపించేందుకు సిద్దమయ్యారు. ఇప్పుడు భారత్కు ఈ కీలక పదవి దక్కేలా ప్రపంచ ఆరోగ్య సంస్థపై ఒత్తిడి తెచ్చి ఉండవచ్చు. కరోనా పుట్టుక, వ్యాప్తిలో చైనా పాత్ర తదితర అంశాలపై దర్యాప్తుకు అమెరికాతో సహా ప్రపంచ దేశాలు పట్టుబడుతున్నాయి. భారత్ కూడా వాటికి మద్దతు పలికింది. చైనాపై దర్యాప్తులో భారత్ కీలక పాత్ర పోషించే అవకాశం ఉంది.