డిల్లీ నిజాముద్దీన్లో జరిగిన తబ్లిగి జమాత్ మత సమావేశాలకు హాజరైవచ్చినవారి ద్వారా దేశంలో పలురాష్ట్రాలకు కరోనా శరవేగంగా వ్యాపించింది. బుదవారం ఒక్కరోజే దేశవ్యాప్తంగా కొత్తగా 376 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ ప్రకటించింది. దీంతో ఒక్కరోజులోనే దేశంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 1,637కు, మృతుల సంఖ్య 39కి చేరింది. కానీ రాష్ట్రాలు ప్రకటించిన తాజా లెక్కల ప్రకారం దేశంలో నిన్న ఒక్కరోజే 400 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కావడంతో దేశంలో కరోనా రోగుల సంఖ్య 1,910కి చేరినట్లు సమాచారం.
తెలంగాణ రాష్ట్రంలో బుదవారం ఒక్కరోజే కొత్తగా 30 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కావడంతో రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 129కు, మృతుల సంఖ్య 9కి చేరింది. బుదవారంనాడు రాష్ట్రంలో ముగ్గురు వ్యక్తులు కరోనాతో మరణించారు.
ఏపీలో నిన్న ఒక్కరోజునే కొత్తగా 67 కరోనా పాజిటివ్ కేసులు నమోదుకావడంతో రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 111కి చేరింది. ఏపీలో కూడా తబ్లిగి జమాత్ మత సమావేశాలకు హాజరైవచ్చినవారి ద్వారానే కరోనా వ్యాప్తి చెందినట్లు తెలుస్తోంది. గుంటూరులో కొత్తగా 20, కడప-15, ప్రకాశం-15, కృష్ణా-15, పశ్చిమగోదావరి జిల్లాలో 14 కొత్త కేసులు నమోదు అయ్యాయి.
లాక్డౌన్ కారణంగా దేశంలో ఇప్పటివరకు కరోనా వైరస్ నియంత్రణలోకి వస్తోందనుకొంటున్న ఈ సమయంలో తబ్లిగి జమాత్ మత సమావేశాలకు హాజరైవచ్చినవారి ద్వారా రెండు రోజులలోనే కరోనా కేసుల సంఖ్య దాదాపు రెట్టింపు అవడంతో కేంద్రరాష్ట్ర ప్రభుత్వాలు, దేశప్రజలు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. దాంతో అన్ని రాష్ట్రాలలో తబ్లిగి జమాత్ మత సమావేశాలకు హాజరైవచ్చినవారిని, వారి కుటుంబ సభ్యులను, వారితో సన్నిహితంగా తిరిగినవారినీ అందరినీ గుర్తించి క్వారంటైన్కు తరలించేందుకు యుద్ధప్రాతిపదికన కేంద్రరాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు చేపట్టాయి.
తాజా సమాచారం ప్రకారం వివిద రాష్ట్రాలలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య ఈవిధంగా ఉంది.
ఆంధ్రప్రదేశ్-111, తెలంగాణ-129, కేరళ-265, తమిళనాడు-234, కర్ణాటక-110, ఒడిశా-5, మహారాష్ట్ర-335, డిల్లీ-152, రాజస్థాన్-120, ఉత్తరప్రదేశ్-177, ఉత్తరాఖండ్-7, గుజరాత్-87, మధ్యప్రదేశ్-86, ఛత్తీస్గఢ్-9, బిహార్-24, జార్ఖండ్-1, పశ్చిమ బెంగాల్-37, పంజాబ్-46, హర్యానా-43, చండీఘర్-17, గోవా-5, అసోం-13, జమ్మూకశ్మీర్-62, లడఖ్-13, హిమాచల్ప్రదేశ్-3, అండమాన్ నికోబార్ దీవులు-10, పుదుచ్చేరి-3, మణిపూర్-1, మిజోరాం-1 కేసులు నమోదు అయ్యాయి.