డిల్లీలో టైమ్స్ నౌ యాక్షన్ ప్లాన్ - 2020 సమ్మిట్ అధ్వర్యంలో ‘దేశ నిర్మాణంలో రాష్ట్రాల పాత్ర’ అనే అంశంపై గురువారం జరిగిన చర్చా కార్యక్రమంలో మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ, “పెద్ద నోట్ల రద్దు వలన దేశానికి చాలా ప్రయోజనం కలుగుతుందనే నమ్మి కేంద్రం నిర్ణయానికి మేము మద్దతు ఇచ్చాము కానీ దాని వలన దేశానికి తీరని నష్టం జరుగడంతో మేము పొరపాటు చేశామని గ్రహించాము,” అని అన్నారు.
సాధారణంగా కీలకమైన, సున్నితమైన అంశాలపై కొంచెం సమయం తీసుకొని ఆలోచించి మాట్లాడే సిఎం కేసీఆర్, పెద్దనోట్ల రద్దు చేసిన వెంటనే కేంద్రానికి మద్దతుగా మాట్లాడటం చూసి చాలా మంది ఆశ్చర్యపోయారు. నోట్ల రద్దు దుష్పరిణామాలను సిఎం కేసీఆర్ కూడా కళ్ళారా చూసిన తరువాత వెంటనే నష్టనివారణ చర్యలు చేపట్టి రాష్ట్రానికి తగినంత నగదు సరఫరా అయ్యేలా చేసి సమస్య తీవ్రతను కొంతమేర తగ్గించి ప్రజాగ్రహం నుంచి తప్పించుకోగలిగారు.
అదేసమయంలో కేంద్రం ఆలోచనల మేరకు రాష్ట్రంలో నగదు రహితలావాదేవీలను కూడా తెలంగాణ ప్రభుత్వం చాలా ప్రోత్సహించింది. అయితే అది సత్ఫలితాలను ఇచ్చింది. నోట్ల రద్దు కారణంగా దేశంలో నగదుకు ‘కరువు’ ఏర్పడటంతో ప్రజలందరూ నగదు రహిత లావాదేవీలవైపు మళ్ళారు. క్రమంగా ఇప్పుడు దానికి అందరూ బాగా అలవాటుపడ్డారు కూడా. నోట్లరద్దు వలన కలిగిన ప్రయోజనం ఇదొక్కటేనని చెప్పవచ్చు.