డిల్లీ అసెంబ్లీ ఎన్నికలలో మళ్ళీ అధికార ఆమ్ ఆద్మీ పార్టీయే ఘన విజయం సాధించబోతోంది. మొత్తం 70 స్థానాలలో ఆమ్ ఆద్మీ పార్టీ 6 స్థానాలు గెలుచుకొని మరో 51 స్థానాలలో ఆధిక్యతలో కొనసాగుతోంది. ఈ ఎన్నికలలో గెలిచెందుకు బిజెపి విశ్వప్రయత్నాలు చేసినప్పటికీ ఆమ్ ఆద్మీ చేతిలో ఓటమి తప్పలేదు. అయితే గత ఎన్నికలతో పోలిస్తే ఈసారి బాగా పుంజుకొంది. 2015 ఎన్నికలలో కేవలం 3 సీట్లు మాత్రమే గెలుచుకొన్న బిజెపి ఈసారి ఎన్నికలలో 2 సీట్లు గెలుచుకొని మరో 11 స్థానాలలో ఆధిక్యతలో కొనసాగుతోంది. గత ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ ఒక్క సీటు కూడా గెలుచుకోలేక శాసనసభలో అడుగుపెట్టలేకపోయింది. ఈసారి కూడా కాంగ్రెస్ మళ్ళీ అదే పరిస్థితి ఎదురైంది. ఇతర పార్టీల అభ్యర్ధులు, స్వతంత్ర అభ్యర్ధులు ఎవరూ ఒక్క సీటు కూడా గెలుచుకోలేకపోయారు.
నేటితో డిల్లీ శాసనసభ గడువు ముగిసినందున లెఫ్టినెంట్ గవర్నర్ అనిల్ బైజాల్ శాసనసభను రద్దు చేశారు. ఈరోజు సాయంత్రంలోగా కౌంటింగ్ పూర్తయి ఫలితాలు వెలువడుతాయి కనుక ఒకటి రెండు రోజులలోగా అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలో ఆమ్ ఆద్మీ పార్టీ మళ్ళీ ప్రభుత్వం ఏర్పాటుచేయనుంది.