ఊహించినట్లుగానే మునిసిపల్ ఎన్నికలలో కూడా అధికార టిఆర్ఎస్ ఘనవిజయం దిశగా దూసుకుపోతోంది. మధ్యాహ్నం ఒంటి గంటవరకు వెలువడిన ఫలితాలలో రాష్ట్రంలోని 120 మునిసిపాలిటీలలో గల 2,979 వార్డులలో టిఆర్ఎస్ 1,228 దక్కించుకోగా, కాంగ్రెస్ పార్టీ-382, బిజెపి కేవలం 172, మజ్లీస్ పార్టీ-42, ఇతరులు 245 స్థానాలు గెలుచుకొన్నారు. మరో 664 స్థానాలలో ఫలితాలు ఇంకా తెలియవలసి ఉంది. మొత్తం 120లో 109 మునిసిపాలిటీలలో టిఆర్ఎస్ ఆధిక్యంలో ఉంది. అలాగే 9లో 5 మునిసిపల్ కార్పోరేషన్లలో టిఆర్ఎస్ ఆధిక్యంలో ఉంది. కనుక ఆ సంఖ్య ఇంకా పెరిగే అవకాశమే ఉంది కానీ తగ్గదని భావించవచ్చు.
మునిసిపల్ ఎన్నికలలో టిఆర్ఎస్ ఘనవిజయం సాధించడంతో రాష్ట్రవ్యాప్తంగా టిఆర్ఎస్ శ్రేణులు సంబరాలు చేసుకొంటున్నారు. తెరాస వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ దావోస్ నుంచి హైదరాబాద్ తిరిగిరాగానే తెలంగాణ భవన్ చేరుకొని పార్టీ ముఖ్యనేతలతో సమావేశమయ్యారు. తెలంగాణ భవన్లో కూడా పండగ వాతావరణం నెలకొంది. ఈరోజు మధ్యాహ్నం 3 గంటలకు సిఎం కేసీఆర్ తెలంగాణ భవన్లో మీడియా సమావేశంలో మాట్లాడబోతున్నారు.