తెరాస ఎమ్మెల్యే చెన్నమనేని భారత పౌరసత్వం రద్దు!

November 20, 2019


img

తెరాస వేములవాడ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్‌కు భారతీయ పౌరసత్వం పొందడానికి అనర్హుడని కనుక అతని పౌరసత్వాన్ని రద్దు చేస్తున్నట్లు కేంద్ర హోంశాఖ తెలియజేసింది. ఆయన తనకు సంబందించిన అనేక వాస్తవాలను దాచిపెట్టి తప్పుడు మార్గం ద్వారా భారతీయ పౌరసత్వం కలిగి ఉన్నారని కనుక ఆయనకు భారతీయ పౌరసత్వం కలిగి ఉండేందుకు అనర్హుడని కేంద్ర హోంశాఖ లిఖితపూర్వకంగా హైకోర్టుకు తెలియజేసింది.

చెన్నమనేని రమేష్‌ 1993లో జర్మనీకి వలస వెళ్ళి ఆ దేశపౌరసత్వం పొందారు. సుమారు 16 ఏళ్ళపాటు అక్కడ ఒక యూనివర్సిటీలో ప్రొఫెసరుగా పనిచేసిన తరువాత 2009లో భారత్‌ తిరిగి వచ్చారు. మళ్ళీ అప్పుడు భారత్‌ పౌరసత్వం స్వీకరించారు. అయితే భారత్‌ పౌరసత్వం పొందేందుకు దేశంలో విధిగా 365 రోజులు ఉండాలనే నిబందన ఉంది. కానీ ఆయన దరఖాస్తు చేసుకొనే సమయానికి 96 రోజులు మాత్రమే ఉన్నారని ఎన్నికలలో పోటీ చేయాలంటే భారత్‌ పౌరసత్వం చాలా అవసరం కనుక ఆ విషయం దాచిపెట్టి పౌరసత్వం పొందారని ఆది శ్రీనివాస్ ఆరోపించారు. 2009, ఫిబ్రవరి 23న ఆయనకు భారత్‌ పౌరసత్వం లభించింది.   

ఆ తరువాత 2009 అసెంబ్లీ ఎన్నికలలో వేములవాడ నుంచి టిడిపి అభ్యర్ధిగా పోటీ చేసి గెలిచారు. మళ్ళీ 2010లో జరిగిన ఉపఎన్నికలలో, 2014 అసెంబ్లీ ఎన్నికలలో తెరాస అభ్యర్ధిగా పోటీ చేసి గెలిచారు. అయితే ఎన్నికల అఫిడవిట్‌లో తనకు ద్వందపౌరసత్వం ఉందనే విషయం దాచిపెట్టారు. ఆయనపై పోటీ చేసి ఓడిపోయిన కాంగ్రెస్‌ నేత ఆది శ్రీనివాస్ 2014లోనే ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేయడంతో ఈ వివాదం మొదలైంది. దానిపై సుదీర్గంగా న్యాయపోరాటం చేస్తూనే రమేష్ మళ్ళీ 2018లో మరోసారి వేములవాడ నుంచి ఎన్నికయ్యారు. ఈ కేసును విచారిస్తున్న హైకోర్టు ఆదేశాల మేరకు కేంద్రహోంశాఖ ఆయన ద్వందపౌరసత్వంపై లోతుగా విచారణ జరిపి ఆయన భారతీయ పౌరసత్వం కలిగి ఉండేందుకు అనర్హుడని హైకోర్టుకు తెలియజేసింది. దీంతో ఆయన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయవలసిన పరిస్థితి ఏర్పడింది. అయితే హోంశాఖ నిర్ణయాన్ని మళ్ళీ సుప్రీంకోర్టులో సవాలుచేసే అవకాశం ఉంది. 

చెన్నమనేని రమేష్‌ భారత్‌లోనే జన్మించినప్పటికీ జర్మనీ నుంచి తిరిగి వచ్చిన తరువాత మళ్ళీ భారత్‌ పౌరసత్వం పొందేందుకు, ఎన్నికలలో పోటీ చేసేందుకు తప్పుడు సమాచారం ఇచ్చినందున ఈ సమస్య ఎదుర్కోవలసి వస్తోంది.


Related Post