మే 23న లోక్సభ ఎన్నికల ఫలితాలు వెలువడిన తరువాత పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి స్థానంలో వేరొకరిని నియమించవచ్చునని జోరుగా ఊహాగానాలు వినిపిస్తున్న ఈ సమయంలోనే తాజాగా మరొక వార్త లీక్ అయ్యింది. కాంగ్రెస్ అధిష్టానం ఆయనకు ఏఐసిసి జనరల్ సెక్రెటరీ పదవి ఇవ్వబోతున్నట్లు దాని సారాంశం. ఈరోజు గాంధీభవన్లో ఉత్తమ్ కుమార్ రెడ్డి, దుద్దిళ్ళ శ్రీధర్ బాబు మద్య జరిగిన ఆసక్తికరమైన సంభాషణ ఆ వార్త నిజమని దృవీకరించడమే కాకుండా తెలంగాణ పిసిసి అధ్యక్షుడుగా శ్రీధర్ బాబు నియమింపబడబోతున్నట్లు స్పష్టం చేస్తోంది.
“ఇక నుంచి నువ్వే బీ-ఫారంలు ఇవ్వబోతున్నావు కదా?” అని ఉత్తమ్ కుమార్ రెడ్డి అనగా “డిల్లీ నుంచి వాటిని పంపించేది నువ్వే కదా?” శ్రీధర్ బాబు చలోక్తిగా బదులిచ్చారు. అంటే ఉత్తమ్ కుమార్ రెడ్డి జాతీయ కాంగ్రెస్లోకి బదిలీ అవడం, శ్రీధర్ బాబు పిసిసి అధ్యక్ష పదవి చేపట్టబోవడం ఖాయమనే అర్ధమవుతోంది.
నల్గొండ నుంచి లోక్సభకు పోటీ చేసిన ఉత్తమ్ కుమార్ రెడ్డి ఒకవేళ గెలిస్తే ఎంపీ కూడా అవుతారు లేకుంటే ఏఐసిసి జనరల్ సెక్రెటరీ అవుతారని స్పష్టం అవుతోంది.