అసెంబ్లీ ఎన్నికలలో గెలిచి అధికారంలోకి వస్తామని కలలుగన్న కాంగ్రెస్ పార్టీ తెరాస చేతిలో మళ్ళీ మరోసారి ఓడిపోవడమే పెద్ద షాక్ అనుకొంటే, ఫలితాలు వెలువడిన నెలరోజుల నుంచే వరుసగా 9 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు పార్టీకి గుడ్ బై చెప్పేసి తెరాసలో చేరిపోవడం అంతకంటే పెద్ద షాక్ అని చెప్పవచ్చు. ఆ షాక్ నుంచి తేరుకోకమునుపే వరుసగా మండలి, లోక్సభ, పరిషత్ ఎన్నికలను ఎదుర్కోవలసివస్తోంది. కనుక రాష్ట్ర కాంగ్రెస్లో మిగిలిన నేతలు తీవ్ర ఒత్తిడికి గురవుతున్నారని భావించవచ్చు. ఈ ఒత్తిడిలో పాల్గొన్న తదుపరి ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ గౌరవప్రదమైన సీట్లు గెలుచుకొంటే గొప్ప విషయమే కానీ ఒకవేళ కేసీఆర్ చెపుతున్నట్లు 16 ఎంపీ సీట్లు తెరాస గెలుచుకొంటే రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ మనుగడ సాగించడం ఇక కష్టమేనని చెప్పవచ్చు. కనుక రాష్ట్ర కాంగ్రెస్ భవిష్యత్ లోక్సభ ఎన్నికల ఫలితాలపైనే ఆధారపడి ఉంటుందని భావించవచ్చు.