సీనియర్ కాంగ్రెస్ నేత, ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి కుమారుడు కార్తీక్ రెడ్డి, బోధ్ నియోజకవర్గం కాంగ్రెస్ ఇన్-ఛార్జ్ అనీల్ జాదవ్ ఈరోజు తెరాసలో చేరనున్నారు. వారితోపాటు కాంగ్రెస్ పార్టీ నుంచి స్పస్పెండ్ అయిన పలువురు కాంగ్రెస్ నేతలు నేడు తెరాసలో చేరవచ్చునని సమాచారం. కాంగ్రెస్ పార్టీ చేవెళ్లతో సహా 16 స్థానాలకు అభ్యర్ధులను ప్రకటించినందున తెరాస కూడా నేడో రేపో తన అభ్యర్ధులను కేటాయించవచ్చు కనుక చేవెళ్ళ నుంచి బరిలో దిగబోతున్న కార్తీక్ రెడ్డి ముందుగానే తెరాసలో చేరుతున్నారు. సబితా ఇంద్రారెడ్డి కూడా తెరాసలో చేరేందుకు సిద్దమైనప్పటికీ ఇప్పటికిప్పుడు అత్యవసరంగా చేరవలసిన అవసరమేమీ లేదు కనుక ఆమె లోక్సభ ఎన్నికల తరువాత తెరాస చేరవచ్చు.
కీలకమైన అసెంబ్లీ ఎన్నికల ముందు తెరాస ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలోకి, లోక్సభ ఎన్నికలకు ముందు సబితా ఇంద్రారెడ్డి వర్గం తెరాసలోకి మారడంతో చేవెళ్ళలో పోటీ ఆసక్తికరంగా మారనుంది. చేవెళ్ళలో ఇప్పుడు కాంగ్రెస్ అభ్యర్ధి కొండా విశ్వేశ్వర్ రెడ్డి కాంగ్రెస్ శ్రేణులతోనే పోరాడక తప్పదు.