నేడు శంషాబాద్ వద్ద రాహుల్ సభ

March 09, 2019


img

కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్ గాంధీ నేడు హైదరాబాద్‌ రానున్నారు. ఈరోజు సాయంత్రం 5.30 గంటలకు శంషాబాద్ వద్ద రాష్ట్ర కాంగ్రెస్‌ అధ్వర్యంలో నిర్వహిస్తున్న బహిరంగసభలో లోక్‌సభ ఎన్నికలకు శంఖారావం పూరించనున్నారు. సాయంత్రం 5 గంటలకు డిల్లీ నుంచి శంషాబాద్‌ విమానాశ్రయం చేరుకొని అక్కడి నుంచి నేరుగా సభాస్థలి చేరుకొంటారు. సభ ముగిసిన తరువాత రాష్ట్ర కాంగ్రెస్‌ పరిస్థితిపై పార్టీ నేతలతో మాట్లాడి వారికి దిశానిర్దేశం చేస్తారు. అనంతరం రాత్రి 7.30 గంటలకు డిల్లీ తిరిగివెళతారు.చేవెళ్ళ నుంచి మళ్ళీ పోటీ చేయబోతున్న ఎంపీ కొండా విశ్వేశర్ రెడ్డి స్వయంగా దగ్గరుండి ఈ సభకు కావలసిన అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు.

కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే దేశంలో అర్హులైన పేద ప్రజలకు కనీస ఆదాయం కల్పిస్తామని రాహుల్ గాంధీ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈరోజు శంషాబాద్‌ సభలో ఆ హామీపై మరింత వివరణ ఇచ్చే అవకాశం ఉంది. అసెంబ్లీ ఎన్నికలలో ఘోరపరాజయం పాలయిన కాంగ్రెస్ పార్టీకి లోక్‌సభ ఎన్నికలను ఒక మంచి అవకాశంగా భావిస్తోంది. ఈ ఎన్నికలలో అత్యధిక సీట్లు గెలుచుకొని తమ సత్తా చాటుకోవాలని రాష్ట్ర కాంగ్రెస్‌ నేతలు పట్టుదలగా ఉన్నారు. కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలంటే రాష్ట్రంలో వీలైనన్ని ఎక్కువ ఎంపీ సీట్లు గెలుచుకోవడం చాలా అవసరం కనుక కాంగ్రెస్‌ అధిష్టానం కూడా రాష్ట్ర కాంగ్రెస్‌ నేతలకు అండగా నిలబడుతూ వారికి అవసరమైన సహాయసహకారాలు అందిస్తోంది. 


Related Post