కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ హైదరాబాద్లో పర్యటిస్తున్న సమయంలోనే సిఎం కెసిఆర్ ముందస్తు ఎన్నికల గురించి మాట్లాడి సెప్టెంబర్ నెల నుంచే తమ పార్టీ అభ్యర్ధుల పేర్లను ప్రకటించడం మొదలుపెడతామని చెప్పారు. కెసిఆర్ చేసిన ఈ ప్రకటనపై కాంగ్రెస్, బిజెపిలు ఇంతవరకు స్పందించకపోవడం విశేషం. "ఎప్పుడు ఎన్నికలొచ్చినా ఎదుర్కోవడానికి సిద్దంగా ఉన్నాము" అనే ఒక రొటీన్ ప్రకటనతో ఉత్తమ్ కుమార్ రెడ్డి సరిపెట్టారు.
కాంగ్రెస్, బిజెపిలు వెంటనే స్పందించకపోయినా కెసిఆర్ చేసిన ఈ ప్రకటనతో టికెట్ల కోసం వాటిపై ఒత్తిడి ఏర్పడటం ఖాయం. ఏ పార్టీకైనా టికెట్లు కేటాయింపు చాలా పెద్ద తలనొప్పి వ్యవహారమే కనుక కాంగ్రెస్, బిజెపిలకు కెసిఆర్ హటాత్తుగా చాలా పెద్ద అగ్నిపరీక్ష పెట్టినట్లు చెప్పవచ్చు. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీలో టికెట్లు, పదవుల కోసం ఏ రేంజ్ లో కీచులాటలు జరుగుతుంటాయో అందరికీ తెలుసు. అభ్యర్ధుల పేర్లు ఖరారు చేయడం మొదలుపెట్టగానే పార్టీలో కుమ్ములాటలు కూడా మొదలయిపోతాయి. కనుక కెసిఆర్ విసిరిన ఈ ఉచ్చులో చిక్కుకోకుండా ఉండేందుకు టిఆర్ఎస్ అభ్యర్డుల పేర్లు ప్రకటించేవరకు కాంగ్రెస్ పార్టీ తన అభ్యర్ధుల పేర్లను కాంగ్రెస్ పార్టీ ప్రకటించకపోవచ్చు.