ముఖ్యమంత్రి కెసిఆర్ నిన్న స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా మెదక్ జిల్లా ముల్కనూర్ లో జరిగిన బహిరంగసభలో తన మనసులో రూపుదిద్దుకొంటున్న మరో బారీ పధకం గురించి చూచాయగా ప్రస్తావించారు. రాష్ట్రంలో అన్ని ప్రాంతాలలో ప్రజలు మురుగునీటి కాలువల కారణంగా రోగాల బారిన పడుతున్నారని కనుక ఈ సమస్య పరిష్కారానికి అండర్ గ్రౌండ్ డ్రైనేజీ వ్యవస్థను ఏర్పాటు చేయడానికి అధ్యయనం మొదలుపెట్టామని చెప్పారు. అన్నీ కుదిరితే ఈ కార్యక్రమాన్ని కూడా చేపడతామని చెప్పారు. అయితే నిన్న రాష్ట్ర వ్యాప్తంగా మంత్రులు, ప్రజాప్రతినిధులు ‘కంటివెలుగు’ పధకం ప్రారంభోత్సవాలు చేస్తునందున, దానికి సంబందించిన వార్తలే మీడియాలో ఎక్కువగా హైలైట్ అయ్యాయి. కనుక అండర్ గ్రౌండ్ డ్రైనేజీ వ్యవస్థను ఏర్పాటు గురించి సిఎం కెసిఆర్ చెప్పినది పెద్దగా హైలైట్ అవలేదు. కానీ రాష్ట్రమంతటా అండర్ గ్రౌండ్ డ్రైనేజీ వ్యవస్థను ఏర్పాటు చేయడం అంటే అది మిషన్ భగీరధ కంటే చాలా పెద్ద పధకం కావచ్చు. ముఖ్యమంత్రి కెసిఆర్ దీని గురించి చూచాయగా చెప్పినప్పటికీ, దీని అమలు చేయడం ఖాయమనే భావించవచ్చు. బహుశః వచ్చే ఎన్నికలలోగానే ఈ కార్యక్రమాన్ని కూడా ప్రారంభిస్తారేమో?