గద్దర్ అవార్డులకు తెలంగాణ ప్రభుత్వం ముహూర్తం ఖరారు చేసింది. జూన్ 14న హైదరాబాద్లో హెచ్ఐసీసీ వేదికగా ఈ అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమాన్ని నిర్వహిస్తామని తెలంగాణ ఫిలిమ్ డెవలప్మెంట్ ఛైర్మన్, నిర్మాత దిల్రాజు తెలిపారు.
యావత్ ప్రపంచం ఈ కార్యక్రమం గురించి మాట్లాడుకునేలా అంగరంగ వైభవంగా నిర్వహిస్తామని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అన్నారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత కేసీఆర్ హయాంలో సినీ పరిశ్రమ చాలా నిరాదరణకు గురైందని, పదేళ్ళుగా అవార్డులు ఇవ్వకపోవడమే ఇందుకు నిదర్శమని అన్నారు.
తెలంగాణలో పుట్టి పెరిగిన గద్దర్ మన రాష్ట్ర సంస్కృతిని, భాషని, యాసని, తెలంగాణ భావజాలాన్ని సర్వత్రా వ్యాపింపజేశారని అన్నారు.
తన వల్లే వచ్చిందని తెలంగాణ కేసీఆర్ చెప్పుకుంటారని, కానీ సింగరేణి ప్రాంతంలో గద్దర్ పాదయాత్రలు చేస్తూ, తన ఆట పాటల ద్వారా ప్రజలను చైతన్య పరిచారని భట్టి విక్రమార్క గుర్తు చేసుకున్నారు.
తెలంగాణ కోసం పోరాడిన ఆ మహానీయుడిని కూడా కేసీఆర్ అపాయింట్మెంట్ ఇవ్వకుండా తన ఇంటి గేటు దగ్గర కూర్చోబెట్టి అవమానించారని భట్టి విక్రమార్క అన్నారు.
నిత్యం ప్రజల మద్య జీవిస్తూ వారి కష్ట నష్టాలను, బాధలను పాట రూపంలో ప్రభుత్వానికి చెప్పిన ఏకైక వ్యక్తి. గద్దర్. కవి, కళాకారుడు, నటుడు, ప్రజల మనిషి గద్దర్ పేరిట సినిమా అవార్డులు ప్రధానం చేయాలనే గొప్ప ఆలోచన చేసిన సిఎం రేవంత్ రెడ్డికి మంత్రి భట్టి విక్రమార్క ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలిపారు.
గద్దర్ సినీ అవార్డుల ఎంపిక కోసం ప్రముఖ నటి జయసుధ నేతృత్వంలో 15 మందితో జ్యూరీ కమిటీ ఏర్పాటు చేశామని వారు అత్యుత్తమ చిత్రాలను, నటీనటులను, సాంకేతిక నిపుణులని ఎంపిక చేస్తారని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క చెప్పారు.