ప్రభాస్ హీరో చేసిన కల్కి ఎడి2898 ఈ నెల 27న ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతోంది. కనుక హైదరాబాద్లో ప్రేక్షకులు, ముఖ్యంగా ప్రభాస్ అభిమానులు ఈ సినిమా తొలిరోజే చూసేందుకు బుక్ మై షో ద్వారా ఆన్లైన్లో టికెట్స్ కొనేసుకుంటున్నారు.
అయితే ఇక్కడే చిన్న గమ్మతు జరిగింది. డా.రాజశేఖర్ హీరోగా నటించిన కల్కి (2019) సినిమా కొన్ని రోజుల క్రితమే కూకట్పల్లి వద్ద గల భ్రమరాంబిక థియేటర్లో రీ రిలీజ్ అయ్యింది. కల్కి ఎడి2898 టికెట్స్ కోసం ఎగబడుతున్న ప్రభాస్ అభిమానులు బుక్ మై షోలో డా.రాజశేఖర్ నటించిన కల్కి సినిమా టికెట్స్ కొనుగోలు చేశారు.
దీంతో భ్రమరాంబిక థియేటర్లో 27వ తేదీ అన్ని షోలకు టికెట్ బుక్ అయిపోయి థియేటర్ హౌస్ ఫుల్ అయిపోయింది. కానీ ఈ కల్కి ఆ కల్కి కాదని తెలుసుకుని అభిమానులు లబోదిబోమన్నారు.
బుక్ మై షో సంస్థ కల్కి సినిమా పేరుతో తమను మోసం చేసిందని, దీనిపై పోలీసులకు పిర్యాదు చేస్తామని కొందరు హెచ్చరించారు. దీంతో అప్రమత్తమైన ఆ సంస్థ అవే టికెట్లతో ప్రభాస్ కల్కి ఎడి2898 సినిమా చూసేందుకు అనుమతిస్తామని సోషల్ మీడియాలో ప్రకటించడంతో వారు శాంతించారు.