తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఓ మీడియా సంస్థకు ఇచ్చిన తాజా ఇంటర్వ్యూలో, “నేను బీఆర్ఎస్ పార్టీ నుంచి బయటకు రాలేదు. వెళ్ళ గొట్టారు. నేను ఆ పార్టీలో ఉన్నప్పుడు కూడా నా గురించి కొందరు చాలా అనుచితంగా, వ్యంగ్యంగా, చులకనగా మాట్లాడుతుండేవారు. ఇప్పుడు నేను ఆ పార్టీలో లేకున్నా నా గురించి అలాగే మాట్లాడుతున్నారు.
వాటన్నిటినీ నేను పట్టించుకోను. పట్టించుకుంటే ముందుకు సాగలేను. ఇక బీఆర్ఎస్ పార్టీ ఓటమికి నా కేసే కారణమన్నట్లు కొత్త వాదన వినిపిస్తున్నారు. కానీ శాసనసభ ఎన్నికల సమయంలో ఈ కేసు విషయం ఎక్కడా ప్రస్తావనకు రాలేదు.
కానీ నేను, నా కేసే కారణమని వాదిస్తున్న వారికి ఓ విషయం చెప్పదలిచాను. బీఆర్ఎస్ పార్టీ ఎందుకు ఓడిపోయిందో ఆ పార్టీ అధిష్టానానికి, ప్రజలందరికీ కూడా తెలుసు. నేనూ చెప్పాను. దాని ఓటమికి 40 కారణాలున్నాయనుకుంటే నాది 41వది కావచ్చేమో కానీ ఇదే ప్రధాన కారణం కానే కాదు. కనుక ఇప్పటికైనా ఈ వితాండవాదన మానుకుంటే మంచిది,” అని అన్నారు.