ప్రస్తుతం రాష్ట్రంలో కాళేశ్వరం ప్రాజెక్టుపై మళ్ళీ అధికార కాంగ్రెస్, విపక్ష బీఆర్ఎస్ పార్టీల మద్య వాదోపవాదాలు సాగుతున్నాయి. ఈ నేపధ్యంలో మాజీ మంత్రి, బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నేత జగదీష్ రెడ్డి మేడిగడ్డ బ్యారేజ్ని సందర్శించి ఈ ప్రాజెక్టు గురించి ఆసక్తికరమైన విషయాలు చెప్పారు.
మేడిగడ్డ బ్యారేజ్లో మూడు పిల్లర్లు క్రుంగినప్పటికీ బ్యారేజ్ ధృడంగానే ఉంది. ఈ ఒక్క బ్యారేజ్ నిర్మాణానికి రూ. 2,500 కోట్లు ఖర్చు చేశాము. కేసీఆర్ చాలా దూరదృష్టితో ఆలోచించి ఈ మేడిగడ్డ బ్యారేజ్ కట్టించారు.
దీని ప్రధానోదేశ్యం వర్షాకాలంలో వరద నీటిని ఇక్కడ నిలువచేసుకుని ఎండాకాలంలో అవసరమైనప్పుడు ఆ నీటిని వినియోగించుకోవచ్చని. కనుక మేడిగడ్డ బ్యారేజ్ లేకపోతే ఈ వెసులుబాటు ఉండదు. కానీ ఒకవేళ ఈ బ్యారేజ్ లేకపోయినా వరద ఉదృతి కొనసాగుతున్నంత వరకు కన్నేపల్లి పంప్ హౌస్ నుంచి నీళ్ళు ఎత్తిపోసుకోవచ్చు.
దీనిపై నుంచి మహారాష్ట్ర-తెలంగాణ రాష్ట్రాల మద్య వాహనాలు తిరుగుతూనే ఉన్నాయి. అయినా బ్యారేజ్ చెక్కుచెదరలేదు. కనుక దీనిలో కొన్ని గేట్లు మూసి నీటిని నిలువచేసుకోవచ్చు. కానీ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం బ్యారేజ్ కూలిపోతుందని చెప్తూ నీటిని దిగువకు విడిచిపెట్టేస్తోంది.
అధికారంలోకి వచ్చి రెండున్నారేళ్ళు గడిచినా ఇంతవరకు మూడు పిల్లర్లకు మరమత్తులు చేయించ కుండా చాలా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. కాళేశ్వరం ప్రాజెక్టుని వినియోగించుకొని రైతులకు నీళ్ళు అందిస్తే కేసీఆర్కి మంచి పేరు వస్తుందనే మేడిగడ్డ బ్యారేజ్కి మరమత్తులు చేయించకుండా పాడుబెడుతున్నారు. కనీసం ఇప్పటికైనా కాళేశ్వరం ప్రాజెక్టుపై రాజకీయాలు చేయడం మానుకొని రైతులకు నీళ్ళు అందించాలి,” అని సిఎం రేవంత్ రెడ్డికి విజ్ఞప్తి చేశారు.