బీఆర్ఎస్ పార్టీ నేతలు నిన్న తెలంగాణ గవర్నర్ శివ్ ప్రతాప్ శుక్లాని కలిసి మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిపై పిర్యాదు చేశారు. అయనకు చెందిన రాఘవ కన్స్ట్రక్షన్స్ కంపెనీ గత రెండేళ్లుగా హిమాయత్ సాగర్లో అక్రమ మైనింగ్ చేస్తోందని వారు గవర్నర్కు లిఖితపూర్వకంగా పిర్యాదు చేశారు.
పదవి, అధికార దుర్వినియోగానికి పాల్పడుతూ ఎటువంటి అనుమతులు లేకుండా మైనింగ్ చేయిస్తున్నారన్నారు.
తాము ఇదే విషయం శాసనసభలో సిఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకువెళ్ళేందుకు ప్రయత్నిస్తే ఆయన పట్టించుకోలేదన్నారు. అందువల్లే గవర్నర్కు పిర్యాదు చేసి జ్యూడిషియల్ విచారణ జరిపించాలని కోరామని బీఆర్ఎస్ పార్టీ నేతలు చెప్పారు.
సుమారు గంటసేపు గవర్నర్ తాము చెప్పిన వివరాలన్నీ శ్రద్దగా విన్నారన్నారు. అన్నీ పరిశీలించి తగు నిర్ణయం తీసుకుంటామని గవర్నర్ హామీ ఇచ్చారని తెలిపారు.
ఒకవేళ గవర్నర్ కూడా స్పందించకపోతే ప్రజల వద్దకు వెళ్ళి కాంగ్రెస్ పాలనలో మంత్రుల దోపిడీ గురించి వివరిస్తామని, వారి అవినీతిని అడ్డుకునేందుకు పోరాటం కొనసాగిస్తామన్నారు.
తెలంగాణ గవర్నర్ శివ్ ప్రతాప్ శుక్లాని కలిసిన వారిలో బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, హరీష్ రావు, తలసాని, సబిత, వేముల, గంగుల, జగదీశ్ రెడ్డి, మల్లారెడ్డి, సునీతా రెడ్డి, పల్లా రాజేశ్వర్ రెడ్డి తదితరులున్నారు.