తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత శనివారం నిజామాబాద్ నుంచి జాగృతి జనం బాట కార్యక్రమం మొదలుపెట్టారు. ముందుగా ఆమె తన అనుచరులతో కలిసి తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాల వేశారు.
అనంతరం ప్రజలను ఉద్దేశ్యించి మాట్లాడుతూ, “ఇంత మంది వచ్చి నాకు ఘన స్వాగతం పలికి ఆదరించినందుకు పేరుపేరునా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. నా ఈ కొత్త ప్రయాణంలో మీ అందరి సహాయ సహకారాలు నాకుంటాయని ఆశిస్తున్నాను.
నేను 27 ఏళ్ళ వయసులో తెలంగాణ ఉద్యమాలలోకి వచ్చాను. అప్పటి నుంచి బీఆర్ఎస్ పార్టీ కోసమే పనిచేశాను. ఏనాడూ పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడలేదు. నష్టం కలిగించే పని చేయలేదు.
కానీ పార్టీలో కొందరు కుట్రలు చేశారు. నిజామాబాద్ లోక్సభ ఎన్నికలలో నన్ను ఎవరు ఓడించారో మీ అందరికీ తెలుసు. నాకు వ్యతిరేకంగా కుట్రలు చేసినవారే నన్ను పార్టీ బయటకు పంపించారు. కనుక నా దారి నేను చూసుకోక తప్పలేదు.
పదేళ్ళ బీఆర్ఎస్ పాలనలో కొన్ని సాధించుకున్నప్పటికీ ఇంకా కొన్ని సాధించుకోవాల్సి ఉంది. అమరవీరులందరికీ దక్కాల్సిన గౌరవం, వారి కుటుంబాలకు ఇంకా న్యాయం జరుగలేదు.
కనుక వీటన్నిటి కోసం మనమందరం కలిసి పోరాటం చేయాల్సి ఉంది. కనుకనే ఈ కార్యక్రమంతో నేడు మీ ముందుకు వచ్చాను. నా ఈ జనం బాటలో రాష్ట్రంలో అన్ని వర్గాలకు చెందిన ప్రజలను, మేధావులను కలిసి మాట్లాడుతాను. సామాజిక తెలంగాణ కోసం అందరినీ కలుపుకొని పోరాడుతాను,” అని అన్నారు.