ఈ నెలాఖరులోగా స్థానిక సంస్థల ఎన్నికలకు షెడ్యూల్ వెలువడబోతోందని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. ఆదివారం కూసుమంచిలో తన క్యాంప్ కార్యాలయంలో జిల్లా ముఖ్య నేతలతో మాట్లాడుతూ, “రేపు (సోమవారం) మద్యాహ్నం సిఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన మంత్రివర్గ సమావేశం జరుగబోతోంది. ఈ సమావేశంలో చర్చించిన తర్వాత ఎన్నికల షెడ్యూల్పై స్పష్టత వస్తుంది.
ముందుగా ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు, ఆ తర్వాత సర్పంచ్ ఎన్నికలు, తర్వాత మున్సిపల్ ఎన్నికలు జరుగుతాయి. స్థానిక సంస్థల ఎన్నికలకు 15 రోజులు మాత్రమే సమయం ఉన్నందున పార్టీలో అందరూ సిద్దంగా ఉండాలి.
ఖచ్చితంగా గెలిచే అవకాశాలు ఉన్నవారినే పార్టీ అభ్యర్ధులుగా ఎంపిక చేస్తాము. ఈ వారంలోనే రైతు భరోసా నిధులు రైతుల ఖాతాలలో జమా చేస్తాము. అలాగే సన్న బియ్యానికి ఇస్తామన్న బోనస్ కూడా రైతుల ఖాతాలలో జమా చేస్తాము.
కనుక కాంగ్రెస్ శ్రేణులు ప్రజల వద్దకు వెళ్ళి వీటన్నిటి గురించి చెప్పుకొని ఓట్లు మన పార్టీ అభ్యర్ధులకు పడేలా గట్టిగా కృషి చేయాలి,” అని మంత్రి పొంగులేటి సూచించారు.