హర్ష్ రోషన్, శ్రీదేవి జంటగా బ్యాండ్ మేళం మార్చి 26న విడుదలై పరవాలేదనిపించుకుంది. నిన్న హైదరాబాద్లో జరిగిన ఈ సినిమా ఫంక్షన్లో దర్శకుడు సతీష్ జవ్వాజీ మాట్లాడుతూ, “రివ్యూలతోనే సినిమాలను చంపేస్తున్నారు.
సినిమా బాగుందో లేదో ప్రేక్షకులు చూసి నిర్ణయించుకొనివ్వాలి. కానీ ఓ ‘గ్రేట్’ వెబ్సైట్ మా బ్యాండ్ మేళం గురించి ఇష్టం వచ్చినట్లు వ్రాసి పడేసింది. మీకు సినిమా నచ్చకపోతే నచ్చలేదని వ్రాయచ్చు. కానీ సినిమాలో కీలకమైన సన్నివేశాల గురించి వ్రాసేసి సినిమాని దెబ్బ తీశారు. సినిమాలపై ఏమాత్రం గౌరవం లేకపోతే ఎలా?
మీ రివ్యూలే మాకు మరణ శాసనాలు అవుతున్నాయనే విషయం ఎందుకు గ్రహించడం లేదు. మీ ఒక్క రివ్యూతో దర్శకుడు, నిర్మాత, సినీ పరిశ్రమలో తమని తాము నిరూపించుకోవాలని ఆరాతపడుతున్న కొత్త నటీనటులు అందరూ చచ్చిపోతారు.
మీరు మీ సొంత అభిప్రాయాలు చెప్పడం కాదు. ప్రేక్షకులతో కలిసి సినిమా చూసి వారి అభిప్రాయలు తెలుసుకొని వ్రాస్తే బాగుంటుంది. రెండు తెలుగు రాష్ట్రాల నుంచి ‘బ్యాండ్ మేళం’ బాగుందని మాకు ఫోన్లు వస్తున్నాయి. కానీ ఇలాంటి రివ్యూలు చదివినవారు థియేటర్లకు వెళ్తారా? కనుక దయచేసి మీ రివ్యూలతో సినిమాలని చంపెయొద్దు,” అని దర్శకుడు సతీష్ జవ్వాజీ అన్నారు.