మారుతి దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా రాజసాబ్ సంక్రాంతి పండుగకు ముందు భారీ అంచనాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. మారుతిపై నమ్మకంతో ఈ సినిమాని 5 భాషల్లో పాన్ ఇండియా మూవీగా విడుదల చేశారు.
కానీ ప్రభాస్ అభిమానులున్న రెండు తెలుగు రాష్ట్రాలలోనే ఈ సినిమాని ప్రేక్షకులు మెచ్చలేదు. ఇతర రాష్ట్రాలలో ఈ సినిమా పది గట్టిగా రోజులు థియేటర్లలో నిలబడగలిగితే చాలా గొప్ప విషయమే అవుతుంది. సంక్రాంతి పండుగ ముగియక మునుపే రోజు రోజుకీ ఈ సినిమా కలెక్షన్స్ పడిపోయాయి.
ప్రీమియర్ షోలతో రూ.9.51 కోట్లు రాగా మొదటి రోజున రూ.53.75 కోట్లు వచ్చింది. రెండో రోజున రూ.26 కోట్లు, మూడో రోజున రూ.19.1 కోట్లు, నాలుగో రోజున రూ.6.6 కోట్లు, ఐదవ రోజున రూ.4.8 కోట్లు, ఆరవ రోజున రూ.5.25 కోట్లు కలిపి భారత్లో మొత్తం రూ.130.40 కోట్లు కలెక్షన్స్ సాధించింది. ప్రపంచవ్యాప్తంగా మొదటి వారంలో రూ. 238 కోట్లు గ్రాస్ కలెక్షన్స్ సాధించినట్లు రాజసాబ్ టీమ్ అధికారిక ప్రకటన చేసింది.
చిన్న సినిమాగా మొదలుపెట్టిన రాజాసాబ్ని పాన్ ఇండియా మూవీగా మార్చడంతో సుమారు రూ.300-350 కోట్లు వరకు ఖర్చుపెట్టినట్లు సమాచారం. కానీ రాజాసాబ్ గ్రాస్ కలెక్షన్స్లో నిర్మాతకు వచ్చేది 40 శాతమే. కనుక ఈ సినిమాతో నిర్మాత పీపుల్ మీడియా ఫ్యాక్టరీ అధినేత టీజీ విశ్వప్రసాద్కు చాలా భారీ నష్టమే రావచ్చు.