ప్రముఖ నటులు సిద్దార్థ్, అదితిరావు హైదరీ బుధవారం ఉదయం వనపర్తి జిల్లాలోని శ్రీ రంగనాధస్వామి ఆలయంలో నిరాడంబరంగా వివాహం చేసుకున్నారని మీడియాలో వార్తలు వచ్చాయి. వాటిపై వారు స్పందిస్తూ తాము ఇంకా పెళ్ళి చేసుకోలేదని, నిన్న జరిగింది కేవలం పెళ్ళి నిశ్చితార్ధం మాత్రమే అని ఇన్స్టాగ్రామ్ ద్వారా తెలియజేస్తూ, నిశ్చితార్ధ ఉంగరాలతో ఫోటోలు పోస్ట్ చేశారు.
వారు రహస్యంగా ఈ వేడుక నిర్వహించడం వలననే మీడియా దానిని తప్పుగా అర్దం చేసుకొంది. హైదిరీ రావు పూర్వీకులు వనపర్తి సంస్థాధీశులు కనుక అక్కడ వారు నిర్మించిన శ్రీ రంగనాధస్వామి ఆలయంలో ఈ శుభకార్యక్రమం చేసుకున్నారు.
ఈ వివాహ నిశ్చితార్ధ కార్యక్రమం గురించి ఎవరికీ తెలియకుండా ఉండేందుకు అక్కడ ఆలయంలో సినిమా షూటింగ్ అవుతుందని ప్రచారం చేయడంతో శ్రీరంగాపూర్ గ్రామస్తులకు కూడా అనుమానం రాలేదు.
సిద్ధార్ధ్, అదితీ రావు హైదిరీ ఇద్దరికీ కూడా ఇది రెండో వివాహమే. సిద్ధార్థ్ మొదట తన చిన్ననాటి స్నేహితురాలు మేఘనను వివాహం చేసుకుని ఆమెతో విభేధాలు రావడంతో 2007లో విడాకులు తీసుకున్నారు. అదితి రావు సత్యదీప్ మిశ్రాను పెళ్లి చేసుకొని విభేదాల కారణంగా 2012లో విడాకులు తీసుకున్నారు.
సిద్ధార్థ్, అదితి రావు తొలిసారిగా అజయ్ భూపతి దర్శకత్వంలో మహా సముద్రం (2021) సినిమాలో కలిసి నటించారు. అప్పుడే వారు ప్రేమలో పడ్డారు. అప్పటి నుంచి కలిసి తిరుగుతున్నారు. ఇన్నేళ్ళ తర్వాత ఇద్దరూ పెళ్ళి పీటలు ఎక్కబోతున్నారు. త్వరలోనే తమ పెళ్ళి ముహూర్తం, వేదిక గురించి తెలియజేస్తామని చెప్పారు.