ఈటల రాజేందర్, మల్లారెడ్డి ఒకప్పుడు బిఆర్ఎస్ పార్టీలో కలిసి పనిచేసినవారే కనుక ఈటల బీజేపీలో చేరినప్పటికీ వారి మద్య సత్సంబంధాలే ఉన్నాయి. శుక్రవారం మేడ్చల్ జిల్లా కండ్లకోయలో ఓ వివాహా శుభ కార్యక్రమంలో వారిద్దరూ కలిసినప్పుడు ఆప్యాయం ఒకరినొకరు కౌగలించుకొని కబుర్లు చెప్పుకున్నారు.
ఈ సందర్భంగా ఈటల రాజేందర్ ‘మల్కాజ్గిరిలో నేను గెలుస్తానా లేదా?” అని అడిగితే, “అటువంటి అనుమానాలు ఏమీ పెట్టుకోకు. నువ్వే తప్పకుండా గెలుస్తావు. అక్కడ నుంచి నా కొడుకుని పోటీ చేయిద్దామనుకున్నాను. కానీ చేయలేకపోయాను. ఆ సీటు నీకు దక్కింది. అదృష్టమంటే నీదే,” అని మల్లారెడ్డి అన్నారు.
మల్లారెడ్డి ప్రస్తుతం బిఆర్ఎస్ పార్టీలోనే ఉన్నప్పటికీ, కాంగ్రెస్ ఒత్తిళ్ళ కారణంగా దానికి దూరంగా ఉంటున్నారు. ఒకానొక సమయంలో కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు కూడా సిద్దపడ్డారు. కానీ చేరలేదు. బహుశః లోక్సభ ఎన్నికల తర్వాత ఫలితాలను బట్టి మల్లారెడ్డి బిఆర్ఎస్ పార్టీలో కొనసాగాలా లేదా కాంగ్రెస్ పార్టీలో చేరాలా? అనేది నిర్ణయించుకోవచ్చు.