లోక్సభ ఎన్నికల ప్రచారానికి మరో మూడు రోజులు మాత్రమే గడువు ఉన్నందున మూడు ప్రధాన పార్టీలు, వాటి అధినేతలు జోరుగా ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నారు.
ప్రధాని నరేంద్రమోడీ బుధవారం ఉదయం వేములవాడ శ్రీరాజారాజేశ్వర స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేస్తారు. ప్రధాని నరేంద్రమోడీ పర్యటన సందర్భంగా మంగళవారం రాత్రి నుంచే ఆయన భద్రతా సిబ్బంది స్వామివారి ఆలయం పరిసర ప్రాంతాలను తమ అధీనంలోకి తీసుకొని కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు.
స్వామివారిని దర్శించుకున్న ఆ తర్వాత ప్రధాని నరేంద్రమోడీ వేములవాడలోని బాలానగర్లో బీజేపీ అధ్వర్యంలో నిర్వహిస్తున్న ఎన్నికల ప్రచార సభలో పాల్గొంటారు. బీజేపీ ఎంపీ అభ్యర్ధిగా పోటీ చేస్తున్న బండి సంజయ్కు మద్దతుగా ఈ సభలో పాల్గొనబోతున్నారు.
అది ముగిసిన వెంటనే హెలికాఫ్టర్లో వరంగల్ చేరుకొని అక్కడ బీజేపీ అభ్యర్ధిగా పోటీ చేస్తున్న ఆరూరి రమేష్కు మద్దతుగా ఎన్నికల ప్రచార సభలో పాల్గొంటారు.
అనంతరం రాజ్భవన్ చేరుకొని రాత్రి అక్కడే బస చేస్తారు. గురువారం ఉదయం బేగంపేట విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో గన్నవరం (విజయవాడ)కు బయలుదేరి ఏపీలో ఎన్నికల ప్రచార సభలలో పాల్గొంటారు.