హైదరాబాద్ సుచిత్ర క్రాస్ రోడ్స్ వద్ద సర్వే నంబర్ 82లో 1.11 ఎకరాల భూవివాదంపై ధర్మపురి కాంగ్రెస్ ఎమ్మెల్యే లక్ష్మణ్ స్పందిస్తూ, “ఆ భూమి మల్లారెడ్డి ఒక్కరిదే కాదు. దానిలో 400 గజాల చొప్పున నేను, ఓ మాజీ ఎమ్మెల్యేతో సహా మొత్తం 15 మంది 2015లో వేరే వ్యక్తి నుంచి మేము కొనుగోలు చేశాము. కానీ ఆ భూమి మొత్తం తనదే అన్నట్లు మల్లారెడ్డి మాట్లాడుతున్నాడు.
ఈ వివాదం గురించి బిఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడే మేము కేటీఆర్ దృష్టికి తీసుకువెళ్లాము. ఆయన అందరూ కూర్చొని మాట్లాడుకుని సమస్యను పరిష్కరించుకోవాలని చెప్పారు. అప్పటి నుంచి మేము మల్లారెడ్డిని భూసర్వేకు రావాలని ఎన్నిసార్లు పిలించినా రాకుండా మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నాడు.
మేము ఈ భూమిపై కోర్టులో కేసు వేస్తే ఇంజక్షన్ ఆర్డర్ ఇచ్చింది. కానీ మల్లారెడ్డి కౌంటర్ దాఖలు చేయకుండా ఊరుకుని, మేము సర్వే చేయించుకుంటుంటే వచ్చి అడ్డుపడుతున్నారు.
ఆయన పలుమార్లు నా పేరు ప్రస్తావించినందుకే నేను కూడా మీడియా సమావేశం పెట్టి ఇదంతా వివరించాల్సి వచ్చింది. ఈ భూమి విషయంలో ఆయనకు ఏమైనా అభ్యంతరం ఉన్నట్లయితే కోర్టులో తేల్చుకోవాలి కానీ ఇలాగ హడావుడి చేయడం సరికాదు,” అని కాంగ్రెస్ ఎమ్మెల్యే లక్ష్మణ్ అన్నారు.