మేడ్చల్ జిల్లాలో విషాద ఘటన... ఏడుగురు మృతి

May 08, 2024
img

మంగళవారం తెలంగాణలో పలు జిల్లాలలో కురిసిన అకాల వర్షాలు రైతులకు తీవ్ర నష్టం కలిగించగా, మేడ్చల్ జిల్లా బాచుపల్లి పోలీస్ స్టేషన్‌ పరిధిలో రేణుకా ఎల్లమ్మ కాలనీలో ఏడుగురు భవన నిర్మాణ కార్మికుల ప్రాణాలను బలిగొన్నాయి. 

మంగళవారం రాత్రి భారీగా కురిసిన వర్షానికి రేణుకా ఎల్లమ్మ కాలనీలో నిర్మాణంలో ఉన్న ఓ భవనం గోడ కూలి పక్కనే ఉన్న రేకుల షెడ్డుపై పడటంతో దానిలో నిద్రిస్తున్న ఏడుగురు కార్మికులు చనిపోయారు. 

సమాచారం అందుకున్న పోలీసులు, జీహెచ్‌ఎంసీ, ఎన్‌డీఆర్‌ఎఫ్‌ బృందాలు హుటాహుటిన అక్కడకు చేరుకొని జెసీబీ సాయంతో శిధిలాలను తొలగించారు. కానీ అప్పటికే అందరూ మృతి చెందారు. మృతులలో ముగ్గురు ఒడిశా, నలుగురు ఛత్తీస్‌ఘడ్‌ రాష్ట్రాలకు చెందినవారుగా పోలీసులు గుర్తించారు.  మృతదేహాలను పోస్ట్ మార్టం కొరకు గాంధీ ఆస్పత్రికి తరలించి కేసు నమోదు చేసి మృతుల కుటుంబాలకు సమాచారం ఇచ్చారు.

Related Post