ఆంధ్రాలో రాజకీయాలు నానాటికీ దిగజారుతూనే ఉన్నాయి. అధికార వైసీపిని, సిఎం జగన్మోహన్ రెడ్డిని ఎవరు వ్యతిరేకించినా వారిపై టిడిపి ముద్ర వేసేసి వైసీపి శ్రేణులు, దాని మీడియా, సోషల్ మీడియా, మంత్రులు చివరికి వర్మ, పోసాని వంటివారు కూడా యుద్ధం ప్రకటించేసి ఎదురుదాడి చేస్తుంటారు.
ఇందుకు జగన్మోహన్ రెడ్డి సొంత చెల్లెలు వైఎస్ షర్మిల, వైఎస్ వివేకానంద రెడ్డి కుమార్తె సునీత వంటివారిని కూడా వైసీపి ఉపేక్షించడం లేదు. ఇక మెగాస్టార్ చిరంజీవిని ఉపేక్షిస్తుందా? అంటే కాదనే అంటున్నారు పోసాని కృష్ణ మురళి.
ఇంతకీ చిరంజీవి చేసిన పాపం ఏమిటంటే, త్వరలో జరుగబోయే శాసనసభ ఎన్నికలలో పిఠాపురం నుంచి పోటీ చేస్తున్న తన తమ్ముడు పవన్ కళ్యాణ్ని గెలిపించమని ఆ నియోజకవర్గం ప్రజలకు ఓ వీడియో సందేశం ద్వారా విజ్ఞప్తి చేయడమే.
పోసాని అందుకు ఆయనపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ప్రజారాజ్యం పార్టీతో నమ్ముకున్నవారిని ముంచేసి తన దాడి తాను చూసుకున్న చిరంజీవి మళ్ళీ ఏ మొహం పెట్టుకొని ప్రజలను తమ్ముడికి ఓట్లు వేయమని అడుగుతారని పోసాని ప్రశ్నించారు. చిరంజీవి రాజకీయాలకు పనికి రారాని ఎప్పుడో తేలిపోయిందని ఇప్పుడు ఆయన తమ్ముడు పవన్ కళ్యాణ్ కూడా పనికిరాడని తేలిపోతుందని పోసాని మెగా సోదరులను ఎద్దేవా చేశారు.
చిరంజీవితో సినీ పరిశ్రమలో అందరూ కట్టకట్టుకొని వచ్చినా పవన్ కళ్యాణ్ని గెలిపించడం, జగన్మోహన్ రెడ్డిని ఓడించడం ఎవరి వలన సాధ్యం కాదని పోసాని తేల్చి చెప్పేశారు.