జూ.ఎన్టీఆర్ అభిమానులకు ఓ శుభవార్త. ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో దేవర సినిమా చేస్తున్న జూ.ఎన్టీఆర్ తన 31వ సినిమాకు సంబందించి మరో తాజా అప్డేట్ ఇచ్చారు ఆ సినిమాకు దర్శకత్వం చేయబోతున్న ప్రశాంత్ నీల్.
ఇప్పటికే ఈ సినిమా ఫస్ట్-లుక్ పోస్టర్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. దానిలో “ఏ నేల అయితే రక్తంతో తడుస్తుందో దానిని ఎప్పటికీ గుర్తు పెట్టుకోవాలి. అది అతని నేల, అతని సామ్రాజ్యం ... కానీ ఆ రక్తం ఖచ్చితంగా అతనిది కాదు,” అంటూ భయంకరమైన హింట్ ఇచ్చారు. దాని ప్రకారం చూస్తే, ఈ సినిమా కూడా కేజీఎఫ్, సలార్లాగే యాక్షన్ సినిమా అనే అనిపిస్తోంది. కానీ ప్రశాంత్ నీల్, “కెజీఎఫ్, సలార్ తర్వాత నేను ఏ సినిమా చేయబోతున్నా అందరూ అది యాక్షన్ చిత్రమే అని అనుకొంటున్నారు. కానీ జూ.ఎన్టీఆర్తో చేయబోయే సినిమా యాక్షన్ కాదు. వేరే జోనర్లో తీయబోతున్నాను. అదేమిటో తర్వాత చెప్తాను,” అని అన్నారు.
ఇక ప్రభాస్తో సలార్ తీసి హిట్ కొట్టి రెండో భాగం చేస్తున్నారు కనుక జూ.ఎన్టీఆర్తో తీయబోయే సినిమా కూడా రెండు భాగాలుగా తీయబోతున్నట్లు సమాచారం.
సూపర్ హిట్ చిత్రాలు అందిస్తున్న దర్శకుడు ప్రశాంత్ నీల్తో జూ.ఎన్టీఆర్ వంటి స్టార్ హీరో సినిమా అంటే మామూలుగా ఉండదు. అదీ రెండు భాగాలుగా అంటే అభిమానులు సంతోషానికి హద్దే ఉండదు. త్వరలోనే ఈ సినిమాకు సంబందించి పూర్తి వివరాలు తెలియజేస్తామని ప్రశాంత్ నీల్ చెప్పారు.
ఈ సినిమాను ఎన్టీఆర్ ఆర్ట్స్, మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్లపై నిర్మించబోతున్నారు.