సమంత నటించిన శాకుంతలం ఈ నెల 17వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతోంది. మయో సైటీస్ వ్యాధి బారిన పడి ఇప్పుడిప్పుడే కొలుకొంటున్న సమంత, త్వరలో ‘సిటాడేల్’ వెబ్ సిరీస్లో నటించేందుకు సిద్దం అవుతోంది. సూపర్ హిట్ ఫ్యామిలీ మ్యాన్-1, 2 వెబ్ సిరీస్ నిర్మించిన రాజ్ అండ్ డికె దర్శకత్వంలోనే ఇది కూడా తెరకెక్కబోతోంది. త్వరలోనే‘సిటాడేల్’ షూటింగులో పాల్గొనబోతున్నట్లు సమంత ట్వీట్ చేశారు. విజయ్ దేవరకొండ అభిమానులు ఆమెకి అభినందనలు తెలియజేస్తూనే, “మా రౌడీ హీరోతో ఖుషీ సినిమా ఇంకా ఎప్పుడు మొదలుపెడతారు?” అని ప్రశ్నించారు. సమంత వెంటనే స్పందిస్తూ, ఇంత ఆలస్యమైనందుకు ముందు వారికి క్షమాపణలు చెప్పి అతి త్వరలోనే మీ అందరినీ ఖుషీ చేస్తానని హామీ ఇచ్చారు.
శివ నిర్వాణ దర్శకత్వంలో ఖుషి సినిమాని గత ఏడాది ప్రారంభించి, మొదట హైదరాబాద్లో తర్వాత కాశ్మీర్లో షూటింగ్ చేసి విజయ్ దేవరకొండ, సమంతలపై కొన్ని సన్నివేశాలు చిత్రీకరించారు. కనుక సమంతకి మయో సైటీస్ వ్యాధి సోకకపోయి ఉంటే ఇప్పటికే ఆ సినిమా షూటింగ్ సగం పూర్తయిపోయి ఉండేది. ఇప్పుడు ఆ సినిమా కూడా మళ్ళీ మొదలుపెడతానని చెప్పినందున, ఈ జూన్-జులైలోగా పూర్తి చేయగలరు. కశ్మీర్ నేపధ్యంలో ఈ సినిమా కధ సాగనుంది.