అలనాటి మేటి నటి జమున ఈరోజు ఉదయం హైదరాబాద్లోని తన నివాసంలో కన్ను మూశారు. ఆమె గత కొంతకాలంగా వృద్ధాప్య సంబందిత ఆరోగ్య సమస్యలతో బాధ పడుతున్నారు. మరికొద్ది సేపటిలో ఆమె భౌతికకాయాన్ని ఫిలిం ఛాంబర్కి తరలిస్తారు.
జమున 1936, ఆగస్ట్ 30వ తేదీన కర్ణాటకలోని హంపీలో జన్మించారు. ఆమె తల్లితండ్రులు నిప్పణి శ్రీనివాసరావు, కౌసల్యాదేవి. ఆమె అసలు పేరు జానాభాయి. జమున గుంటూరులోని దుగ్గిరాల బాలికల పాఠశాలలో చదువుకొన్నారు. బాల్యంలోనే ఆమె నాటకాలలో నటించారు. వాటితోనే ఆమె సినిమా అవకాశం వచ్చింది. 1952లో విడుదలైన పుట్టిల్లు సినిమాతో ఆమె సినీ రంగంలో ప్రవేశించి తెలుగు, తమిళ్, కన్నడ, హిందీ భాషల్లో అనేక వందల సినిమాలలో అందరూ అగ్ర హీరోలతో కలిసి నటించారు.
ఎన్టీఆర్ శ్రీకృష్ణుడు పాత్రకి ప్రాణం పోసిన్నట్లే జమున సత్యభామ పాత్రకి ప్రాణం పోశారు. అనేక సాంఘిక, జానపద, పౌరాణిక పాత్రలలో ఆమె తన అపూర్వమైన నటనతో తెలుగు, తమిళ, కన్నడ, హిందీ ప్రజల మనసులు దోచుకొన్నారు. సినీ పరిశ్రమ ముద్దుబిడ్డగా ఆమె అందుకొన్న అవార్డులకి లెక్కే లేదు. దక్షిణాది రాష్ట్రాలలో ఇంత గొప్ప నటికి కేంద్ర ప్రభుత్వం పద్మ పురస్కారం ఇవ్వకపోవడం చాలా బాధాకరం. జమున 1989లో కాంగ్రెస్ పార్టీ తరపున రాజమండ్రి నుంచి పోటీ చేసి లోక్సభకి ఎన్నికయ్యారు.