తెలంగాణలో రాష్ట్రపతి పాలనకు బీఆర్ఎస్‌ విజ్ఞప్తి?

September 09, 2026


img

సోమవారం శాసనసభ బయట పోలీసులు బీఆర్ఎస్‌ పార్టీ ప్రజా ప్రతినిధులపై దౌర్జన్యం చేయడం, నిన్న (మంగళవారం) కొందరు కాంగ్రెస్‌ నాయకుల అధ్వర్యంలో కాంగ్రెస్‌ శ్రేణులు ఎర్రవల్లి ఫామ్‌హౌసును చుట్టుముట్టడం, అక్కడకు వెళ్ళేందుకు బయలుదేరిన బీఆర్ఎస్‌ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌, హరీష్‌ రావు తదితరులను దారిలో అడ్డుకోవడం వంటి ఘటనలను బీఆర్ఎస్‌ పార్టీ తీవ్రంగా పరిగణించింది. 

నేడు బీఆర్ఎస్‌ పార్టీ ముఖ్య నేతలు గవర్నర్‌ శివ్‌ ప్రతాప్ శుక్లాని కలిసి వీటన్నిటి గురించి వివరించి, రాష్ట్రంలో శాంతి భద్రతలకు భంగం కలుగుతున్నాయి కనుక రాష్ట్రపతి పాలన విధింపుకు కేంద్రానికి సిఫార్సు చేయాలని కోరబోతున్నట్లు తెలుస్తోంది. తమపై పోలీసులు దౌర్జన్యం చేయడం, తమ ఎమ్మెల్సీలను ప్రస్తుత సమావేశాల నుంచి సస్పెండ్ చేయడంపై బీఆర్ఎస్‌ పార్టీ న్యాయపోరాటానికి కూడా సిద్దమవుతోంది.

కనుక ఈసారి శాసనసభలో వాడివేడిగా చర్చలు జరుగుతాయనుకుంటే బయట కాంగ్రెస్‌, బీఆర్ఎస్‌ పార్టీల మద్య భీకర పోరాటాలు జరుగుతుండటం విశేషం.


Related Post