ఏపీలో జనసేన తొలిసారిగా అధికారంలోకి వచ్చిన తర్వాత మెగా ఫ్యామిలీకి పదవులు పంపిణీ మొదలైంది. మొదట కొణిదెల నాగబాబుకు ఎమ్మెల్సీ కట్టబెట్టారు. దానికి మరింత వన్నె తేవాలంటే మరో పదవి తప్పనిసరి కనుక ఈసారి ఏపీ గ్రీన్ ఎగ్జిక్యూటివ్ కమిటీ చైర్మన్ కట్టబెట్టారు.
మెగా ఫ్యామిలీకి రెండు ప్రభుత్వాలలో పరపతి ఉన్నందున తెలంగాణ ప్రభుత్వం ఇటీవలే చిరంజీవి సతీమణి సురేఖను యాదాద్రి ఆలయ బోర్డు సభ్యురాలుగా నియమించిన సంగతి తెలిసిందే.
తాజాగా చిరంజీవి, సురేఖల కుమార్తె సుస్మిత కొణిదెలకు కూడా ఓ పదవి లభించింది. బెజవాడ కనకదుర్గమ్మ ఆలయ ట్రస్ట్ బోర్డులో ఆమెను ప్రత్యేక ఆహ్వానితురాలుగా నియమిస్తూ ఏపీ దేవాదాయ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఆలయంలో భక్తులకు కల్పిస్తున్న సౌకర్యాలు, ఆలయ అభివృద్ధి కార్యక్రమాలు, ఆలయ ఉత్సవాల నిర్వహణలో ఆమె ట్రస్ట్ బోర్డుకు సలహాలు ఇస్తారట!
వడ్డించేవాడు మనోడు అయితే వరుసలో చివర కూర్చున్నా పర్వాలేదు.. అన్నీ విస్తర్లో పడతాయన్నట్లు, ఏపీలో పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రి అయిన తర్వాత కొణిదెల కుటుంబానికి ఈవిధంగా పదవులు వడ్డిస్తున్నారు. తర్వాత ఎవరికో?