హైదరాబాద్లోని ఈ నెల 16న జగన్నాథ రథయాత్ర జరుగబోతోంది. బేగంబజార్లో జగన్నాథ్ మఠ్, ఖాకీ అఖాడా ఆధ్వర్యంలో ఘనంగా రథయాత్ర నిర్వహించనున్నట్లు నిర్వాహకులు ప్రకటించారు.
ఈ సందర్భంగా శ్రీ జగన్నాథ స్వామికి 56 రకాల నైవేద్యాలను సమర్పించనున్నారు. గురువారం మధ్యాహ్నం 12.01 గంటలకు జుమెరాత్ బజార్లోని ఆలయం నుంచి రథయాత్ర ప్రారంభం కానుంది. అదే రోజు సాయంత్రం 6.31 గంటలకు ప్రత్యేక ఛప్పన్ భోగ్ దర్శనం నిర్వహించనున్నారు. ఈ దర్శనం రథయాత్రలో ప్రధాన ఆకర్షణగా నిలవనుందని ఆలయ మహంత్ అమృత్ దాస్ ఖాకీ తెలిపారు.
నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొనే అవకాశం ఉందని తెలిపారు. కనుక రథయాత్రలో భక్తుల సౌకర్యార్థం ఆలయ కమిటీ ప్రత్యేక ఏర్పాట్లు చేపట్టినట్లు నిర్వాహకులు తెలిపారు. రథయాత్రలో ఎటువంటి అవాంచనీయ ఘటనలు జరుగకుండా పోలీస్ శాఖ అవసరమైన బందోబస్తు ఏర్పాటు చేస్తోంది.