నిన్న రైతు భరోసా నిధుల విడుదల సభలో సిఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ, పదేళ్ళ బీఆర్ఎస్ పాలన, 30 నెలల కాంగ్రెస్ పాలనలో తెలంగాణ రాష్ట్రంలో ఎంత అభివృద్ధి జరిగింది? అని చర్చించేందుకు రావాలని బీఆర్ఎస్ పార్టీకి సవాలు విసిరారు.
దీనిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందిస్తూ సిఎం రేవంత్ రెడ్డి సవాలుని స్వీకరిస్తున్నట్లు చెప్పారు. నేడు తెలంగాణ భవన్లో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ, “కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్ళయినా ఇంతవరకు ఏం చేశామో చెప్పుకోలేని పరిస్థితిలో ఉంది. పైగా అభివృద్ధి విషయంలో చర్చకు రావాలని సిఎం రేవంత్ రెడ్డి సవాలు విసిరారు. ఆయనతో బహిరంగ చర్చకు నేను సిద్దం. టైమ్ డేట్, ప్లేస్ మీరే చెప్పండి. నేను తప్పకుండా వస్తా.
రైతులు, ఉద్యోగులు, మహిళలు, యువతకు ఇచ్చిన హామీల అమలు విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైంది. నేటికీ ఎన్నికల హామీలు అనేకం అమలు చేయనే లేదు. కాంగ్రెస్ ప్రభుత్వం అవినీతికి పాల్పడుతూ మమ్మల్ని నిందిస్తోంది. తెలంగాణ రాష్ట్రంలో ఏమైనా అభివృద్ధి చెందిందంటే అది బీఆర్ఎస్ హయంలోనే. ముప్పై నెలల్లో 72 సార్లు ఢిల్లీకి వెళ్ళి వచ్చిన రేవంత్ రెడ్డి ఢిల్లీకి వెళ్ళే పరిస్థితి లేదని చెప్పడం చాలా హాస్యాస్పదంగా ఉంది,” అంటూ కేటీఆర్ విరుచుకు పడ్డారు.