కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి సంజయ్ భగీరధ్ హైకోర్టులో పిటిషన్ వేశారు. హైదరాబాద్, సుచిత్రా క్రాస్ రోడ్స్ వద్ద నివసిస్తున్న ఓ 17 ఏళ్ళ మైనర్ బాలిక, ఆమె తల్లి తండ్రుల పిర్యాదు మేరకు షేక్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్లో పోక్సో కేసు నమోదైంది.
తనపై నమోదు చేసిన ఆ కేసుని కొట్టి వేయాలంటూ భగీరధ్ పిటిషన్ ద్వారా హైకోర్టుని అభ్యర్ధించారు. గురువారం హైకోర్టు వెకేషన్ బెంచ్ ఈ పిటిషన్పై విచారణ చేపట్టనుంది.
అయితే ఇది పోక్సో కేసు కనుక పోలీసుల వివరణ కూడా తీసుకున్నాకనే న్యాయస్థానం తగు నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుంది తప్ప ఏకపక్షంగా పోక్సో కేసు రద్దు చేసే అవకాశం ఉండదు.
ఒకవేళ హైకోర్టు పోలీసుల జవాబుతో సంతృప్తి చెందితే తదుపరి విచారణకు అవసరమైతే బండి సంజయ్ భగీరధ్ ని ప్రశ్నించేందుకు అనుమతించవచ్చు.
ఈ కేసు విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉదాసీనంగా వ్యవహరిస్తోందంటూ బీఆర్ఎస్ పార్టీ చేస్తున్న విమర్శలతో తప్పనిసరిగా చర్యలు తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.
కానీ మరోపక్క బండి సంజయ్ హోంశాఖ సహాయ మంత్రిగా ఉన్నందున పోలీసులు తొందరపాటు నిర్ణయాలు తీసుకోలేరు. కనుక ఈ కేసులో హైకోర్టు ఆదేశాలు కీలకంగా మారవచ్చు.