టీవీకే పార్టీ అధినేత విజయ్ జోసెఫ్ నేడు తమిళనాడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. చెన్నైలోని నెహ్రూ ఇండోర్ స్టేడియంలో ఈరోజు ఉదయం 10 గంటలకు గవర్నర్ అర్లేకర్ ఆయన చేత ప్రమాణ స్వీకారం చేయిస్తారు.
విజయ్తో పాటు మరో తొమ్మిది మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేస్తారు. వారిలో 29 ఏళ్ళ వయసున్న ఎస్.కీర్తన కూడా ఒకరు. ఆమె శివకాశి నుంచి ఎమ్మెల్యేగా విజయం సాధించారు.
నిన్న సాయంత్రమే వీసీకే, ఐయుఎంఎల్ పార్టీల ఎమ్మెల్యేలు సంతకాలు చేసి ఇవ్వడంతో టీవీకే పార్టీ బలం 120కి చేరింది. ఆ లేఖలు పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేసిన గవర్నర్ అర్లేకర్ విజయ్ని ప్రభుత్వం ఏర్పాటు చేయాల్సిందిగా ఆహ్వానించారు. ఈ మేరకు లోక్ భవన్ ప్రకటన విడుదల చేసింది.
విజయ్ ప్రమాణ స్వీకారానికి ఇదివరకే అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. కనుక పార్టీ నేతలు, మద్దతు ఇచ్చిన ఎమ్మెల్యేలు, అభిమానుల సమక్షంలో మరికొద్ది సేపటిలో విజయ్ తమిళనాడు సిఎంగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు.