తమిళనాడులో టీవీకే పార్టీ ప్రభుత్వ ఏర్పాటుపై 5 రోజులుగా కొనసాగుతున్న సస్పెన్స్ గవర్నర్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ముగిసింది. ఇప్పుడు ఈ సీన్ కేరళకు మారింది. కేరళలో కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్ పూర్తి మెజార్టీతో విజయం సాధించింది. కనుక ప్రభుత్వ ఏర్పాటులో ఎటువంటి సందిగ్ధత, ఆటంకాలు లేవు.
కానీ ముఖ్యమంత్రి పదవికి ముగ్గురు సీనియర్లు పోటీ పడుతుండటంతో వారిలో ఎవరికి ఈ పదవి కట్టబెట్టాలని నిర్ణయించేందుకు కాంగ్రెస్ అధిష్టానం తరపున పరిశీలకులుగా ముకుల్ వాస్నిక్, అజయ్ మాకెన్ కేరళకు వచ్చి ఎమ్మెల్యేల అభిప్రాయాలు తెలుసుకుని ఢిల్లీ తిరిగివెళ్ళి కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు నివేదిక సమర్పించారు.
వారు ముగ్గురూ చర్చించిన తర్వాత ముఖ్యమంత్రి పేరు ప్రకటిస్తారని అందరూ ఎదురు చూశారు. కానీ సోనియా, రాహుల్ గాంధీలను కూడా సంప్రదించిన తర్వాత తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. కనుక అదివారం అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది.
పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రిగా సువేందు అధికారి నేడు కోల్కత్తాలో ప్రధాని మోడీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, బిజేపి, ఎన్డీయే ముఖ్యమంత్రుల సమక్షంలో ప్రమాణస్వీకారం చేశారు.