తెలంగాణ ప్రభుత్వం భూముల ధరలు పెంచాలని నిర్ణయించడంతో రాష్ట్ర వ్యాప్తంగా రిజిస్ట్రేషన్లు జోరందుకున్నాయి. భూములు ధరలు పెరిగితే రిజిస్ట్రేషన్ ఛార్జీలు కూడా భారీగా పెరుగుతాయి. కనుక అవి పెరగక మునుపే రిజిస్ట్రేషన్ చేయించుకునేందుకు ప్రజలు తొందరపడుతున్నారు. కనుక తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలలో రద్దీ పెరిగిపోయింది.
ముఖ్యంగా హైదరాబాద్ పరిధిలో పెరిగిన రద్దీని దృష్టిలో ఉంచుకొని రంగారెడ్డి రూరల్, సంగారెడ్డి, షాద్ నగర్, ఫరూక్ నగర్, సరూర్ నగర్, ఎల్బీ నగర్, ఘట్ కేసర్, శేరిలింగంపల్లి, చంపాపేట, వనస్థలిపురం, గండిపేట్, మహేశ్వరం, పటాన్ చెరు, కుత్బుల్లాపూర్, నల్గొండ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు ఈ నెల 12 నుంచి 15వ తేదీ వరకు ఉదయం 9.30 గంటల నుంచి సాయంత్రం 6.30 గంటల వరకు పనిచేస్తాయి.
ప్రజల సౌకర్యార్ధం అదనపు పని గంటలు పనిచేసేలా ఆదేశించామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. ఒకవేళ అవసరమైతే స్లాట్ బుకింగ్స్ సంఖ్య, సబ్ రిజిస్ట్రార్ పని గంటలు పెంచుతామని మంత్రి తెలిపారు.