సిఎం రేవంత్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న మూసీ రివర్ ప్రాజెక్టు పనులు ఈ ఏడాది ఆగస్ట్ నుంచి మొదలు పెట్టేందుకు మార్గం సుగమం అయ్యింది. దీని కోసం రాష్ట్ర ప్రభుత్వం తరపున అధికారులు ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంకుతో చర్చలు జరపగా తొలి దశ నిర్మాణ పనులకు రూ.7,055 కోట్లు రుణం ఇచ్చేందుకు అంగీకరించింది. ఇదే విషయం వారు డెప్యూటీ సిఎం భట్టి విక్రమార్క నేతృత్వంలోని మంత్రివర్గ ఉపసంఘానికి తెలియజేశారు.
తొలి దశలో మూసీ పరివాహక ప్రాంతాలలో గల నిర్మాణాలపై ప్రభావం పడకుండా 5 కిమీ మేర పనులు ప్రారంభించాలని అధికారులను ఆదేశించారు. అవసరమైతే నిర్మాణాలను కాపాడేందుకు అలైన్మెంట్లో అవసరమైన మార్పులు చేర్పులు చేయాలని సూచించారు. ఈ ఆగస్ట్ నెల నుంచి పనులు ప్రారంభించి వచ్చే ఏడాది డిసెంబర్ నాటికి పూర్తి చేయాలని ఆదేశించారు. కనుక మూసీ రివర్ ప్రాజెక్ట్ పనులు త్వరలో ప్రారంభం కావడం ఖాయమేనని భావించవచ్చు.