తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత తన కొత్త పార్టీని ఈ నెల 27 ఉదయం 8 గంటలకు సిద్ధిపేటలో ప్రకటించబోతున్నారు. ఆరోజే ఆమె పార్టీ పేరు, జెండా, అజెండా ప్రకటించనున్నారు.
మే మొదటివారంలో ప్రకటిస్తానని చెప్పినప్పటికీ బహుశః ఇలాంటి మంచి రోజు, ముహూర్తం మళ్ళీ దొరకదని రెండు నెలల ముందుగానే ప్రకటి స్తుండవచ్చు లేదా ఆమె పార్టీ ఏర్పాటుకి కేంద్ర ఎన్నికల కమీషన్ నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చినందున కావచ్చు. ఆమె పార్టీ పేరు ‘తెలంగాణ ప్రజా జాగృతి’ అని తెలుస్తోంది.
పార్టీ పేరులో తెలంగాణ, జాగృతి రెంటినీ అలాగే ఉంచుకుని మద్యలో ప్రజలని జోడించడం మంచి ఆలోచనే.
ఆమె తన పార్టీ ప్రకటనకు సిద్ధిపేటని ఎంచుకోవడం వెనుక రెండు కారణాలున్నాయి. ఒకటి అది ఆమె అత్తవారి జిల్లా. రెండు తన తండ్రి కేసీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న గజ్వేల్ నియోజకవర్గం, ఆమె గుంటనక్క అని అభివర్ణిస్తున్న హరీష్ రావు నియోజకవర్గం సిద్ధిపేట కావడమే.
వచ్చే ఎన్నికలలో తాను అక్కడి నుంచే పోటీ చేయబోతున్నానని కల్వకుంట్ల కవిత ఇదివరకే ప్రకటించారు. ఆమె ఇదే మాటపై ఉంటే, హరీష్ రావుపై నేరుగా ఢీ కొనబోతున్నారన్న మాట!
ఏది ఏమైనప్పటికీ మహిళా నాయకత్వంలో ఆవిర్భవిస్తున్న ఈ కొత్త పార్టీ ప్రయాణం ఏవిధంగా సాగుతుందో? ఎన్ని మలుపులు తిరుగుతుందో? ఏవిధంగా లక్ష్యం చేరుకుంటుందో? కాలమే సమాధానం చెపుతుంది.