ప్రధాని మోడీ నేడు ఢిల్లీలో తన అధికార నివాసం ఏపీ, తెలంగాణ బీజేపి ఎంపీలకు అల్పాహార విందు ఇచ్చారు. ఈ సందర్భంగా వారితో రాష్ట్ర రాజకీయాల గురించి మాట్లాడారు.
తెలంగాణలో బీజేపి బలపడేందుకు మంచి అవకాశం ఉన్నప్పటికీ బీజేపి నేతలు కలిసికట్టుగా ఎందుకు పనిచేయడం లేదని ప్రధాని మోడీ ప్రశ్నించారు. తెలంగాణ శాసనసభ, లోక్సభ ఎన్నికలలో ఘోరపరాజయం పాలైన బీఆర్ఎస్ పార్టీ నేటికీ ప్రధాన ప్రతిపక్షపార్టీగా ఉంటూ చురుకుగా పనిచేస్తోంది.
కానీ లోక్సభ ఎన్నికలలో బీజేపి 8 సీట్లు గెలుచుకున్నప్పటికీ ఎందుకు ఇంత నిస్తేజంగా ఉందని ప్రధాని మోడీ ప్రశ్నించారు. వచ్చే ఎన్నికలలో గెలుపే లక్ష్యంగా అందరూ కలిసి కట్టుగా పనిచేయాలని ప్రధాని మోడీ వారికి సూచించారు.
ఏపీలో కూటమి ప్రభుత్వంలో బీజేపి కూడా భాగస్వామిగా ఉంది. కనుక తమ ప్రభుత్వంపై వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి, ఆ పార్టీ నేతలు చేస్తున్న విమర్శలు గట్టిగా తిప్పి కొట్టాలని ప్రధాని మోడీ ఏపీ బీజేపి ఎంపీలకు సూచించారు.
ఏపీ సిఎం చంద్రబాబు నాయుడు నేతృత్వంలో కూటమి ప్రభుత్వం శరవేగంగా దూసుకుపోతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తోందని ప్రధాని మోడీ ప్రశంశిస్తూ ఆయనకు బీజేపి ఎంపీలు తోడుగా నిలవాలని సూచించారు.