వరంగల్ టెక్స్టైల్ పార్కులో ఇప్పటికే కొన్ని టెక్స్టైల్ కంపెనీలు వచ్చాయి. వాటి నిర్మాణ పనులు, ఉత్పత్తి వివిధ దశలలో ఉన్నాయి. అవన్నీ గత ప్రభుత్వం, ప్రస్తుత ప్రభుత్వం సాధించినవే. కేంద్ర ప్రభుత్వం తరపున కూడా మరికొన్ని టెక్స్టైల్ కంపెనీలు రాబోతున్నాయి. ఈ విషయం కేంద్ర జౌళిశాఖ సహాయమంత్రి పబిత్ర మార్గరీటా లోక్సభలో చెప్పారు.
నల్గొండ కాంగ్రెస్ ఎంపీ కందుకూరు రఘువీర్ దీనికి సంబంధించి అడిగిన ప్రశ్నకు ఆమె సమాధానం చెపుతూ, “వరంగల్లో పిఎంమిత్ర అపారాల్ పార్కులో మొత్తం 1,327 ఎకరాలున్నాయి. తొలి దశలో 866.84 ఎకరాలలో రూ.3,862 కోట్లు పెట్టుబడితో కొన్ని టెక్స్టైల్ కంపెనీలు ఏర్పాటు కాబోతున్నాయి. వాటి ద్వారా సుమారు 24,400 మందికి ప్రత్యక్షంగా ఉద్యోగాలు లభిస్తాయి,” అని చెప్పారు.
మరో ప్రశ్నకు కేంద్ర వ్యవసాయశాఖ సహాయ మంత్రి రామ్నాథ్ ఠాకూర్ సమాధానం చెపుతూ, “మినుముల ఉత్పత్తిలో దేశంలో తెలంగాణ రాష్ట్రం మొదటి స్థానంలో, మొక్కజొన్న, శనగల ఉత్పత్తిలో రెండో స్థానంలో, వరి ఉత్పత్తిలో మూడో స్థానంలో నిలిచింది” అని చెప్పారు.