బీసీ రిజర్వేషన్స్ విషయంలో ఊహించినట్లే సుప్రీంకోర్టు కూడా హైకోర్టు తీర్పుని సమర్ధించింది. దానిని సవాలు చేస్తూ తెలంగాణ ప్రభుత్వం వేసిన పిటిషన్ని కొట్టి వేసింది. హైకోర్టు చెప్పినట్లుగానే రిజర్వేషన్స్ 50 శాతం మించకుండా స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించుకోవచ్చని స్పష్టం చేసింది.
ప్రభుత్వ పిటిషన్పై జస్టిస్ విక్రమ్ నాథ్, జస్టిస్ సందీప్ మెహతాళ ద్విసభ్య ధర్మాసనం నేడు విచారణ చేపట్టి, సుదీర్గంగా సాగిన ఇరు పక్షాల వాదనలు సావధానంగా వింది. అనంతరం బీసీలకు 42 శాతం రిజర్వేషన్స్ పెంచేందుకు ప్రభుత్వం జారీ చేసిన జీవో:9పై స్టే కొనసాగిస్తున్నట్లు స్పష్టం చేసింది.
తెలంగాణ ప్రభుత్వం తరపున సీనియర్ న్యాయవాదులు అభిషేక్ సింఘ్వీ వాదించగా, బీసీ రిజర్వేషన్స్ పెంపుని వ్యతిరేకిస్తూ దాఖలైన పిటిషనర్ల తరపు మాధవ్ రెడ్డి వాదించారు.
బీసీ రిజర్వేషన్స్ పెంపు కోసం తెలంగాణ ప్రభుత్వం కేంద్రంపై ఒత్తిడి తెచ్చి పార్లమెంటులో చట్ట సవరణలు చేయించలేదు. ఇప్పుడు సుప్రీంకోర్టు కూడా బీసీ రిజర్వేషన్స్ పెంపుకి బ్రేక్ వేయడంతో తెలంగాణ ప్రభుత్వం ముందున్న దారులన్నీ మూసుకుపోయినట్లే!
కనుక పాత రిజర్వేషన్స్ ప్రకారమే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాల్సి ఉంటుంది. వాటిలో కాంగ్రెస్ పార్టీ పరంగా బీసీ అభ్యర్ధులకు 42 శాతం సీట్లు కేటాయించుకోవడానికి ఎటువంటి అభ్యంతరం ఉండదు. కనుక ఆ ప్రకారమే ముందుకు సాగే అవకాశం ఉంది.