బిఆర్ఎస్ ఎమ్మెల్యే మల్లారెడ్డి, నిన్న బీజేపీ మల్కాజ్గిరి అభ్యర్ధి ఈటల రాజేందర్ని ఓ పెళ్ళిలో కలిసినప్పుడు వారిరువురూ సరదాగా కాసేపు కబుర్లు చెప్పుకున్నారు. మల్కాజ్గిరి నుంచి ఈటల రాజేందర్ గెలవడం ఖాయమని మల్లారెడ్డి చెప్పడంతో బిఆర్ఎస్ పార్టీలో కలకలం మొదలైంది,
బిఆర్ఎస్ పార్టీకి చెందిన మల్లారెడ్డి మల్కాజ్గిరి నుంచి పార్టీ అభ్యర్ధిగా పోటీ చేస్తున్న రాగిడి లక్ష్మారెడ్డి గెలుస్తారని చెప్పకుండా, బీజేపీ అభ్యర్ధిగా పోటీ చేస్తున్న ఈటల రాజేందర్ గెలుస్తారని చెప్పడమే ఇందుకు కారణం.
దీనిపై పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందిస్తూ,”మల్లారెడ్డి మాటలను అర్ధం చేసుకోవడం కష్టం. ఆయన తన రాజకీయ అనుభవంతో ఈటల రాజేందర్ని బోల్తా కొట్టించే ప్రయత్నం చేశారు. ఆయన ఈటల రాజేందర్ని మునగ చెట్టు ఎక్కిపడిపోయేలా చేశారు. కానీ మల్కాజ్గిరి నుంచి రాగిడి లక్ష్మారెడ్డి భారీ మెజార్టీతో గెలుస్తారు. ఈసారి ఎన్నికలలో బిఆర్ఎస్ పార్టీ అత్యధిక ఎంపీ సీట్లు గెలుచుకొని మళ్ళీ ఫామ్లోకి రాబోతోంది. కాంగ్రెస్, బీజేపీలకు తెలంగాణ రాష్ట్రం, ప్రజల సమస్యలపై ఆసక్తి లేదు. బిఆర్ఎస్ పార్టీ ఒక్కటే తెలంగాణకు శ్రీరామ రక్షగా నిలుస్తుంది,” అని అన్నారు.