కేసీఆర్ బిఆర్ఎస్ పార్టీతో జాతీయ రాజకీయాలలో ప్రవేశిస్తున్నారు. ముందుగా మహారాష్ట్రలో తన పార్టీని విస్తరించేందుకు గట్టిగా ప్రయత్నిస్తున్నారు. అయితే కేసీఆర్ వైఖరిని, వర్తమాన రాజకీయాలను గమనించిన్నట్లయితే, కేసీఆర్ జాతీయ రాజకీయాలలో రాణించగలరా?ప్రధాన మంత్రి కావాలనే తన లక్ష్యాన్ని సాధించగలరా? అనే సందేహాలు కలుగుతాయి. దీనికి రెండు బలమైన కారణాలు కనిపిస్తున్నాయి.
1. తన నాయకత్వాన్ని అందరూ అంగీకరించాలని కేసీఆర్ కోరుకొంటుండటం.
2. కాంగ్రెస్ పార్టీని దూరంగా ఉంచాలనుకోవడం.
కేసీఆర్కు గొప్ప నాయకత్వ లక్షణాలే ఉండవచ్చు గాక. కానీ దేశంలో ఇతర రాష్ట్రాలలో కూడా ఇటువంటి గొప్ప నాయకత్వ లక్షణాలున్న వారు చాలామందే ఉన్నారు. ఉదాహరణకు పశ్చిమ బెంగాల్, బిహార్ ముఖ్యమంత్రులు మమతా బెనర్జీ, నితీశ్ కుమార్లు. కేసీఆర్ మొదట వారివద్దకు వెళ్ళి కలిసి పనిచేద్దామని ప్రతిపాదించారు. కానీ పైన చెప్పుకొన్న రెండు కారణాల వలన వారిద్దరూ కేసీఆర్ను దూరంగా పెట్టారు లేదా కేసీఆరే వారిని దూరంగా పెట్టారు.
ఇవే కారణాల చేత కుమారస్వామి (కర్ణాటక), స్టాలిన్ (తమిళనాడు), ఉద్దవ్ థాక్రే (మహారాష్ట్ర), నవీన్ పట్నాయక్ (ఒడిశా)ల టరితరులకు కూడా కేసీఆర్ దూరం అయ్యారు. కనుక ఆయా రాష్ట్రాలలో రైతులను, రాజకీయ నిరుద్యోగులను కేసీఆర్ చేరదీస్తున్నారు. కానీ సముద్రం దాటాలంటే నాటు పడవ సరిపోదు. ఇటువంటివారిని నమ్ముకొని జాతీయ రాజకీయాలలో రాణించాలనుకొంటే కుక్క తోక పట్టుకొని గోదారి ఈదడమే అవుతుంది.
ముఖ్యంగా ఉత్తరాది రాష్ట్రాలలో దక్షిణాదికి చెందిన నాయకుడు నెగ్గుకు రావడం చాలా కష్టం. కనుక కేవలం 17 ఎంపీ సీట్లున్న కేసీఆర్ నాయకత్వంలో దేశంలో 50-80 ఎంపీ సీట్లున్న అన్ని పార్టీలని పనిచేయాలని ఆశించడం అత్యశే అవుతుంది. కనుక వారితో కలిసి పనిచేసేందుకు, అవసరమైతే వారి నాయకత్వంలో పనిచేసేందుకు సిద్దపడాల్సి ఉంటుంది.
కాంగ్రెస్ను కలుపుకోకుండా ముందుకు సాగాలనే వైఖరిపై కూడా కేసీఆర్ పునరాలోచన చాలా అవసరం. లేకుంటే దేశంలో ఆయనతో కలిసి వచ్చేవారుండరు. పైగా వారందరితో కూడా కేసీఆర్ పోటీ పడాల్సి ఉంటుంది. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ బలహీనంగా ఉంది. దానికి బలమైన ప్రత్యామ్నాయం లేదు కనుక కేంద్రంలో మళ్ళీ మోడీ ప్రభుత్వమే ఎలాగూ అధికారంలోకి వస్తుంది. కానీ మోడీని కొట్టాలని పరుగులు తీస్తుంటే తెలంగాణలో అధికారం కోల్పోయే ప్రమాదం పొంచి ఉంది.