ప్రభాస్ ఒకేసారి నాలుగు సినిమాలు పట్టాలెక్కించినప్పటికీ వాటిలో మారుతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న రాజా డీలక్స్ ఒక్కటే ఈ ఏడాది విడుదలయ్యే అవకాశం కనిపిస్తోంది. ఓం రౌత్ దర్శకత్వంలో పూర్తిచేసిన ఆదిపురుష్ టీజర్ విడుదల చేయగానే విమర్శలు వెల్లువెత్తడంతో దానిని మళ్ళీ చక్కదిద్దే పనిలో పడ్డాడు దర్శకుడు. కనుక వచ్చే ఏడాదిలోనే విడుదల చేయగలమని ప్రకటించేశాడు.
ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో సలార్ సినిమా గురించి అసలు అప్డేట్స్ ఇవ్వడం లేదు. కనుక అదెప్పుడు విడుదలవుతుందో తెలీదు.
ఇక తాజాగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో మొదలుపెట్టిన ప్రాజెక్ట్-కె సినిమాకి సంబందించి సోషల్ మీడియాలో ఓ వార్త వినిపిస్తోంది. మూడో ప్రపంచయుద్ధం చాలా విస్తృతమైన కధాంశం గనుక దీనిని ఒకే భాగంలో సరిపెట్టడం కష్టం కనుక రెండు భాగాలుగా తీయాల్సి ఉంటుందని దర్శకుడు నాగ్ అశ్విన్ చెప్పగా దానికి ప్రభాస్ ఓకే చెప్పిన్నట్లు ఆ వార్తా సారాంశం. ఇది నిజమో కాదో తర్వాత తెలుస్తుంది కానీ ఈ సినిమా మొదటి భాగంమైనా ఈ ఏడాదిలోగా విడుదలయ్యే అవకాశమే లేదు.
మారుతి తక్కువ బడ్జెట్తో వేగంగా మినిమమ్ గ్యారెంటీ సినిమాలు అందిస్తాడనే మంచి పేరుంది కనుక ప్రభాస్ అభిమానులు ఇప్పుడు దర్శకుడు మారుతి మీదే ఆశలు పెట్టుకొని ఎదురుచూడక తప్పదు.
ఈ సినిమాలో ప్రభాస్ తాతగా బాలీవుడ్ నటుడు బొమ్మై ఇరానీ నటించబోతున్నట్లు తెలుస్తోంది. ఆయన ఇదివరకే అత్తారింటికి దారేది, బెంగాల్ టైగర్ సినిమాలలో నటించారు. ఇప్పుడు ప్రభాస్ సినిమాలో మరోసారి అవకాశం లభించింది. ఈ సినిమాలో ప్రభాస్కు జోడీగా మాళవిక మోహనన్, నిధి అగర్వాల్ నటిస్తున్నారు. మారుతి మార్క్ కామెడీ, లవ్, యాక్షన్తో రూపొందబోతున్న ఈ సినిమాను పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తోంది.