అగ్నిమాపక సిబ్బంది పనేమిటి? ఎక్కడైనా అగ్ని ప్రమాదం జరిగితే వెళ్ళి మంటలు ఆర్పి, ప్రజల ఆస్తులు, ప్రాణాలు కాపాడటం! కానీ మధ్యప్రదేశ్ రాష్ట్రంలో సింగ్రౌలి జిల్లాలో అగ్నిమాపక సిబ్బంది తమ ఎమ్మెల్యే రామ్ నివాస్ షా కారును కడిగారు. అదీ.. ఎమ్మెల్యే క్వార్టర్ వద్దకు అగ్నిమాపక వాహనం తీసుకు వెళ్ళి దాని మోటార్ ఆన్ చేసి ఆ నీళ్ళతో ఎమ్మెల్యే వాహనాన్ని కడిగారు.
ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మంటలు ఆర్పేందుకు ఉపయోగించాల్సిన సిబ్బందిని, అగ్నిమాపక వాహనాన్ని, దానిలో నీటిని ఓ ఎమ్మెల్యే కారు కడిగేందుకు వాడటం ఏమిటని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. నిజమే కదా?
దీనిపై సదరు ఎమ్మెల్యే, అగ్నిమాపక శాఖ అధికారులు ఇంకా స్పందించాల్సి ఉంది. సింగ్రౌలి మున్సిపల్ కమీషనర్ సవితా ప్రాధాన్ దీనిపై స్పందిస్తూ, “ఇప్పుడే ఈ విషయం వింటున్నాను. దీని గురించి నాకు తెలీదు. పూర్తి సమాచారం వచ్చాక స్పందిస్తాను,” అని చెప్పి తప్పించుకున్నారు.