బీఆర్ఎస్ పార్టీ అధ్వర్యంలో శనివారం హైదరాబాద్లో నిర్వహించనున్న ‘యువ సంగ్రామ సభ’కు తెలంగాణ హైకోర్టు అనుమతి ఇచ్చింది.
ఈ సభకు పోలీసులు అనుమతి నిరాకరించడంతో బీఆర్ఎస్ పార్టీ హైకోర్టును ఆశ్రయించగా న్యాయమూర్తి ఇరుపక్షాల వాదనలు విన్న తర్వాత కొన్ని షరతులతో సభ నిర్వహించుకోవచ్చని స్పష్టం చేశారు. సభ నిర్వహణ సందర్భంగా చట్టం, శాంతిభద్రతలకు ఎలాంటి భంగం కలగకుండా అధికారులు విధించిన నిబంధనలను కచ్చితంగా పాటించాలని హైకోర్టు ఆదేశించింది. సభలో రెచ్చగొట్టే ప్రసంగాలు చేయకుండా, ప్రజలకు ఇబ్బందులు కలగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది.
కాంగ్రెస్ ప్రభుత్వం యువతకు ఇచ్చిన హామీలు, నిరుద్యోగ సమస్యలు, ఉద్యోగ నియామకాల అంశాలపై ప్రభుత్వాన్ని నిలదీయడమే సభ ప్రధాన ఉద్దేశంగా పార్టీ ప్రకటించింది. కనుక దీనిని బీఆర్ఎస్ ప్రతిష్ఠాత్మకంగా తీసుకుని హైకోర్టు నుంచి అనుమతి సంపాదించుకుంది. అయితే ఈ సభలో అధికార కాంగ్రెస్ పార్టీపై తీవ్ర విమర్శలు చేయడం ఖాయం.
కనుక ఈ సభని అడ్డుకునేందుకు కాంగ్రెస్ శ్రేణులు లేదా దాని మద్దతుదారులు ప్రయత్నిస్తే తప్పకుండా ఘర్షణ వాతావరణం ఏర్పడుతుంది. అటువంటి పరిస్థితి ఏర్పడకుండా పోలీసులు నివారించాల్సి ఉంటుంది. కనుక భారీ భద్రతా ఏర్పాట్లు చేయక తప్పదు.
హైకోర్టు అనుమతితో సభపై నెలకొన్న అనిశ్చితి తొలగిపోయింది. దీంతో బీఆర్ఎస్ శ్రేణులు ఏర్పాట్లు వేగవంతం చేశాయి. ఈ సభలో పార్టీ భవిష్యత్ కార్యాచరణపై కీలక ప్రకటన వెలువడే అవకాశం ఉందని సమాచారం.